స్కై స్కానర్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ వెల్లడించింది.
నివేదిక ప్రకారం 56 శాతం మంది ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించేందుకు, 54 శాతం మంది పండుగలు, ఉత్సవాల కోసం, 51 శాతం మంది ఆధ్యాత్మిక యాత్రల కోసం ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అలాగే 51 శాతం మంది పూర్తిగా సాంస్కృతిక అనుభవాల కోసమే సెలవులను ప్లాన్ చేస్తుండగా, 36 శాతం మంది సంస్కృతి తమ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని భావిస్తున్నారు.
అయితే, ఇప్పటికే 95 శాతం మంది హైదరాబాద్ ప్రయాణికులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించగా, 87 శాతం మంది అసలైన సంప్రదాయాలు, వారసత్వాన్ని తెలుసుకునేందుకు స్థానిక ప్రాంతాలను కూడా అన్వేషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుర్గాపూజ, దీపావళి, కుంభమేళా, పొంగల్, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది.
విదేశీ సాంస్కృతిక పర్యటనలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 25 శాతం మంది ఇటువంటి పర్యటనలు చేయగా, మరో 65 శాతం మంది వెళ్లాలని వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, జపాన్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలవగా, థాయ్లాండ్, వియత్నాం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో చార్మినార్, యాదాద్రి, భద్రాచలం, చిలుకూరు బాలాజీ ఆలయం, బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర, వరంగల్ వారసత్వ కట్టడాలు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా ప్రయాణికులు పేర్కొన్నారు.
అయితే భద్రత, వాతావరణ మార్పులు, అధిక రద్దీ, వసతి లభ్యత, పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. సంస్కృతి ఆధారిత పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని స్కైస్కానర్ ఎక్స్ప్లోర్ విత్ ఏఐ, ప్రైస్ అలర్ట్స్, హోల్ మంత్ సెర్చ్, ఫ్లైట్ ట్రాకర్ వంటి డిజిటల్ సాధనాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.


