సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-XII' విజయవంతమైంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ , జువైనల్ బ్యూరో , పలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
బాల కార్మికులుగా పనిచేస్తున్న, భిక్షాటన చేస్తున్న, వీధులు, నిర్మాణ ప్రాంతాలు తదితర ప్రమాదకర ప్రాంతాల్లో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించి పునరావాసం కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యంగా చేపట్టారు. ఈ డ్రైవ్ కోసం నగరంలోని అన్ని డివిజన్లలో 26 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాపార సముదాయాలు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్సు, రైల్వే స్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఆపరేషన్లో భాగంగా మొత్తం 1,413 మంది చిన్నారులను రక్షించారు. వీరిలో 1,331 మంది బాలురు, 82 మంది బాలికలు ఉన్నారు. రక్షించిన చిన్నారుల్లో 828 మంది తెలంగాణకు చెందినవారు, 563 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు, 22 మంది నేపాల్కు చెందినవారుగా అధికారులు గుర్తించారు.
బాలలను చట్టవిరుద్ధంగా పనుల్లో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో 64 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అలాగే కనీస వేతనాల చట్టం కింద 723 కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు రూ.25,90,175 జరిమానా విధించారు.
అడిషనల్ సీపీ (క్రైమ్స్) ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్ పర్యవేక్షణలో ఆపరేషన్ను సమర్థవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ప్రారంభానికి ముందు అన్ని భాగస్వామ్య సంస్థలతో సమన్వయ సమావేశం, అనంతరం 26 డివిజనల్ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలు అందించడంతో ఈ ప్రత్యేక డ్రైవ్ విజయవంతమైందని వెల్లడించారు.


