హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(TSRTC)బస్సులో ఓ మహిళ చిత్రీకరించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
ఆ మహిళ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ల పైన ఉన్న ఒక సూచన బోర్డును గమనించారు. దానిపై ‘పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం‘ అని స్పష్టంగా రాసి ఉంది. సాధారణంగా బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్ల గురించి లేదా మహిళల భద్రతకు సంబంధించిన బోర్డులను ఎక్కువగా చూస్తుంటాం. కానీ, పురుషుల సీట్ల కేటాయింపు మరియు వారికి ఇవ్వాల్సిన గౌరవం గురించి ఆర్టీసీ బస్సులో ఇలాంటి సందేశం కనిపించడంతో ఆమె దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
ఓ మహిళ TGSRTC బస్సులో ఉన్న ఓ సందేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం."
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.#Men… pic.twitter.com/rKP8nAiYK1— Orugallu Adda (@OrugalluAdda) August 3, 2026
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం గగనంగా మారింది. సాధారణ సీట్లలో కూడా మహిళలు కూర్చోవడం వల్ల పురుషులు నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. పురుషుల హక్కులను, వారి శ్రమను గుర్తించి ఆర్టీసీ ఇలాంటి బోర్డులు పెట్టడం అభినందనీయం‘ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రయాణంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా పెద్దవారు, గర్భిణులు, చిన్న పిల్లలతో ఉన్నవారికి సీటు ఇవ్వడమే అసలైన సంప్రదాయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీట్ల కేటాయింపు కంటే పరస్పర అవగాహన, గౌరవం ముఖ్యమని పేర్కొంటున్నారు.
మొత్తానికి ఆర్టీసీ బస్సులోని ఆ ఒక్క సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ’పురుషుల సీట్ల కేటాయింపు ప్రయాణికుల బాధ్యత’పై పెద్ద చర్చకే తెరలేపింది.


