ఖమ్మం జిల్లా: మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గౌతమి వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
గిరిజన ప్రాంతానికి చెందిన గౌతమి ఎంతో కష్టపడి 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. అయితే, ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండే ఆమె, సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్లను ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పాఠశాల వేళల్లో విధులను నిర్లక్ష్యం చేస్తూ రీల్స్ చేస్తున్నారని, హెచ్చరించినా వైఖరి మార్చుకోలేదని పేర్కొంటూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఆమెను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ కాలం పూర్తికావడంతో ఇటీవలే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత పరిస్థితులు మరింత విషమించాయి. పోస్టింగ్ ఉత్తర్వుల కోసం వెళ్లినప్పుడు విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల నుండి దారుణమైన అవమానాలు ఎదురయ్యాయని, పాఠశాలలో సహోద్యోగుల నుంచి తీవ్రమైన మానసిక వేధింపులు, కుట్రలు మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి.
సహోద్యోగుల వేధింపులు, అధికారుల కఠిన వైఖరి, సామాజిక మాధ్యమాల ఒత్తిడిని తట్టుకోలేకపోయిన గౌతమి, చివరకు తాను ఎంతగానో ప్రేమించి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రకటించారు. తెలియక చేసిన చిన్న తప్పుకు దారుణమైన శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


