breaking news
Heritage Tourism Promotion
-
హైదరాబాద్ ట్రావెలర్స్ కొత్త ట్రెండ్.. కల్చర్ ఫస్ట్!
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ వెల్లడించింది.నివేదిక ప్రకారం 56 శాతం మంది ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించేందుకు, 54 శాతం మంది పండుగలు, ఉత్సవాల కోసం, 51 శాతం మంది ఆధ్యాత్మిక యాత్రల కోసం ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అలాగే 51 శాతం మంది పూర్తిగా సాంస్కృతిక అనుభవాల కోసమే సెలవులను ప్లాన్ చేస్తుండగా, 36 శాతం మంది సంస్కృతి తమ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని భావిస్తున్నారు.అయితే, ఇప్పటికే 95 శాతం మంది హైదరాబాద్ ప్రయాణికులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించగా, 87 శాతం మంది అసలైన సంప్రదాయాలు, వారసత్వాన్ని తెలుసుకునేందుకు స్థానిక ప్రాంతాలను కూడా అన్వేషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుర్గాపూజ, దీపావళి, కుంభమేళా, పొంగల్, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది.విదేశీ సాంస్కృతిక పర్యటనలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 25 శాతం మంది ఇటువంటి పర్యటనలు చేయగా, మరో 65 శాతం మంది వెళ్లాలని వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, జపాన్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలవగా, థాయ్లాండ్, వియత్నాం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో చార్మినార్, యాదాద్రి, భద్రాచలం, చిలుకూరు బాలాజీ ఆలయం, బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర, వరంగల్ వారసత్వ కట్టడాలు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా ప్రయాణికులు పేర్కొన్నారు.అయితే భద్రత, వాతావరణ మార్పులు, అధిక రద్దీ, వసతి లభ్యత, పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. సంస్కృతి ఆధారిత పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని స్కైస్కానర్ ఎక్స్ప్లోర్ విత్ ఏఐ, ప్రైస్ అలర్ట్స్, హోల్ మంత్ సెర్చ్, ఫ్లైట్ ట్రాకర్ వంటి డిజిటల్ సాధనాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తాం: మోదీ
కోల్కతా: దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని ప్రధాని మోదీ అన్నారు. కోల్కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. బెల్వెడెరె హౌస్, మెట్కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రావాల్సి ఉండగా ఆమెకు బదులుగా రాష్ట్ర మంత్రి హకీం హాజరయ్యారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిటిష్ హయాంలో, స్వాతంత్య్రానంతరం రాసిన దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయని తెలిపారు. ‘అధికారం కోసం తండ్రిని కొడుకు చంపడం, సోదరులు కొట్లాడుకోవడం వంటివి మనం చూశాం. ఇవి కాదు భారత దేశ చరిత్ర’ అని ఆయన అన్నారు. సీఏఏ వివాదాస్పదం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో జాతీయభావాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం జాతీయ భావమే మూలం’ అని వ్యాఖ్యానించారు. -
రెండో రోజూ సందడిగా ట్రావెల్ మీట్
సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి : రాష్ట్రంలోనే తొలిసారి నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రావెల్మీట్ రెండవరోజూ సందడిగా కొనసాగింది. బేగంపేట పర్యాటకభవన్లో నిర్వహిస్తున్న ఈ మీట్లో భాగంగా ఉదయం హెరిటేజ్ టూరిజం ప్రమోషన్-బాటిల్నెక్, సొల్యూషన్స్ అనే అంశంపై పర్యాటక రంగ ప్రముఖులు ఎస్.కె.మిశ్రా, జి.కిషన్రావు, నరేంద్రలూథర్, వినోద్ డేనియల్ తదితరులు మాట్లాడారు. రెండో సెషన్లో లగ్జరీ, లీజర్, లైఫ్స్టైల్ టూరిజం అనే అంశంపై సుభాష్ గోయల్, గిరీష్ సెహగల్, అకేష్ భట్నాగర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ప్రదర్శనను ప్రారంభించారు. మధ్యాహ్నం సెషన్లలో పాకశాస్త్ర ప్రావీణ్యం-స్థానిక ఆహారం అనే అంశంపై సంబంధిత రంగ ప్రముఖులు బి.ఆర్.రావు, చలపతిరావులతో పాటుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆలమ్లు మాట్లాడారు. అనంతరం సినిమా పర్యాటకం, స్థానిక ప్రాంతాల అభివృధ్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనిలో సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డీవోటీ జాయింట్డెరైక్టర్ బాలసుబ్రమణ్యారెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జీఎన్రావులు పాల్గొని మాట్లాడారు.


