
‘వనజీవి’ స్మరణార్థం భారీగా మొక్కలు నాటిన బృహస్పతి టెక్నాలజీస్
పద్మశ్రీ దరిపల్లి రామయ్య ప్రేరణతో వినూత్న ప్రయత్నం
సాక్షి, సిటీబ్యూరో: జీవితాంతం హరిత విప్లవానికి అంకితమై విశేష కృషి చేసిన ‘వనజీవి’ పద్మశ్రీ దరిపల్లి రామయ్య స్మరణార్థం నగర శివారులోని ప్రముఖ ఏఐ ఆధారిత సర్వైలెన్సెస్ ఈ–సెక్యూరిటీ సిస్టమ్స్ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జీవితాంతం మొక్కలు పెంచుతూ, పర్యావరణ సంరక్షణ కోసం పాటు పడిన వనజీవి రామయ్యకు నివాళిగా వెల్జెర్ల వేదికగా 100 మందికి పైగా బృహస్పతి టెక్నాలజీస్ ఉద్యోగులు, స్థానిక రైతులు పాల్గొని మొక్కలు నాటుతూ రామయ్యను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏకకాలంలో 600కు పైగా మొక్కలు నాటుతూ భవిష్యత్ కార్యాచరణను ప్రారంభించామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ పాపోలు తెలిపారు.

ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై విజ్ఞానం పెంచేందుకు విశేషంగా పనిచేసిన ఉద్యోగులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వారిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందించారు. ప్రతి పౌరుడూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని రామయ్య చెప్పకనే చెప్పారని గుర్తు చేశారు. ఈ మొక్కలు నాటడంలో పద్మశ్రీ దరిపల్లి రామయ్య సేవలు తమకు ప్రేరణ అని, ఈ ప్రయత్నంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ సంస్థగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంచడమే కాదు, పనితో వచ్చే ఒత్తిడిని కూడా తగ్గించవచ్చన్నారు. సస్టెయినబిలిటీ, సామాజిక బాధ్యతగా ఈ వినూత్న కార్యక్రమం సామాజిక విప్లవంగా మారాలని అన్నారు.