కథానీతి
ఒక ఊర్లో ఓ చిల్లరకొట్టు వ్యాపారి కొడుకు పదవ తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. చదివింది చాలని ఇకపై అంగడిని చూసుకుంటానని నాన్నకు చెప్పాడు. నాన్న ఒప్పుకోలేదు. ఎలాగైనా చదివే పని నుంచి తప్పించుకోవాలని చిన్నగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు. ‘ఎంత చదివినా నోట్లోకి నాలుగువేళ్ళు వెళ్ళడానికే కదా, ఆ డబ్బు ఈ వ్యాపారంలో సంపాదిస్తాను’ అని చెప్పాడు. తల్లి, వాడిని ఇంటి మొదటి అంతస్తుకు తీసుకెళ్ళింది.
ఏమి కనిపిస్తోందని అడిగింది. మన వీధంతా కనిపిస్తోందని చెప్పాడు. రెండో అంతస్తుకు రమ్మంది. ఇప్పుడేమి కనిపిస్తోందని ప్రశ్నించింది. ఇప్పుడు మన ఊరంతా కనిపిస్తోందని బదులిచ్చాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్ళి చూపింది. ‘అరె, ఇప్పుడు మన ఊరే కాదు, దూరంగా ఉన్న కొండలు, కాలువలు కూడా కనిపిస్తున్నాయి’ అని అన్నాడు. అంతస్తులు ఎక్కేకొద్దీ మనం చాలా దూరం వరకు చూడవచ్చు. అలాగే నువ్వు పెద్ద చదువులు చదివితే పెద్ద ప్రపంచాన్ని చూడగలవు.
నీకు తెలుసో లేదో మీ అమ్మమ్మ ఊర్లో ఓ తల్లి ఉంది. నేను కాదు, మన తాత ముత్తాతలకు ముందు నుంచే ఆమె చదువుతూ ఉందట. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆమె చదవడం ఆపదట. చూడాలని ఉంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళి చూడు’ అని చెప్పింది. నిత్య చదువరిగా ఉన్న ఆ తల్లి ఎవరో వెళ్లి చూద్దామని మరుసటి రోజే అమ్మమ్మ ఊరికి బయలుదేరాడు. మనవడు వచ్చాడని అవ్వ సంబరపడిపోయింది. వేడివేడిగా దోశెలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్నాక ‘ఈ ఊర్లో తరాల తరబడి చదివే ఓ తల్లి ఉందట కదా, చూసి వెళ్దామని వచ్చాను’ అని చెప్పాడు.
అమ్మమ్మ నవ్వి ‘‘చదువుల తల్లి సరస్వతీదేవిని అలా అంటారు. ఆ తల్లి ఇంకా చదవడం కొనసాగిస్తూ ఉందని భక్తుల విశ్వాసం. నువ్వు బాగా చదవాలని అమ్మ అలా చెప్పి ఉంటుంది’’ అని ఊర్లోని బడి ముందర ఉన్న సరస్వతీదేవి విగ్రహం ముందరకు తీసుకెళ్ళింది. అమ్మ మాటల లోతు అర్థం చేసుకున్నాడు. ‘పెద్ద చదువులు చదువుతాను, పదిమందికీ ఉపయోగపడతాను’ అని నిర్ణయం తీసుకుని అమ్మవారికి నమస్కరించి అక్కడి నుంచి కదిలాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు


