చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు! | AI Cant Replace Teachers, Rules Madras High Court | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!

Jun 18 2026 8:23 AM | Updated on Jun 18 2026 11:29 AM

AI Cant Replace Teachers, Rules Madras High Court

ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సాంకేతికత ఎంత పెరిగినా, చాట్-జిపిటి వంటి అధునాతన ఏఐ టూల్స్ ఏవీ కూడా తరగతి గదిలో బోధించే ఒక అర్హత కలిగిన ఉపాధ్యాయుడితో సమానం కాలేవని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ముగ్గురు లా విద్యార్థుల అటెండెన్స్ వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు, ఆన్‌లైన్ క్లాసులు అనేవి కేవలం అవసరానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయాలు మాత్రమే కానీ, అవి భౌతిక తరగతులకు ప్రత్యామ్నాయం కాలేవని తేల్చి చెప్పింది.

విద్యార్థులకు నిరాశ.. కోర్టు కీలక వ్యాఖ్యలు
చెన్నైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ’ కి చెందిన ముగ్గురు లా విద్యార్థులు కనీస అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షలు రాసే అర్హతను కోల్పోయారు. దీనిపై వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, బుధవారం నాటి విచారణలో విద్యార్థులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావిస్తూ, ఆన్‌లైన్ విద్య కేవలం ఒక మార్గం మాత్రమేనని, ప్రత్యక్షంగా క్లాస్‌రూమ్‌లో కూర్చుని నేర్చుకునే చదువుతో దీనిని పోల్చలేమని పేర్కొంది.

సుప్రీంకోర్టుకు చేరిన అటెండెన్స్ వివాదం
మరోవైపు, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కనీస హాజరు (మినిమం అటెండెన్స్) నిబంధనలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చేరింది. కనీస హాజరు లేదనే కారణంతో విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకోవద్దంటూ గత నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై, ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో కాలేజీల్లో అటెండెన్స్ ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా లీగల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

క్లాస్‌రూమ్ చదువుకే హైకోర్టు మొగ్గు
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థుల సమగ్ర వికాసానికి భౌతిక తరగతి గది వాతావరణమే అత్యంత కీలకమని మద్రాస్ హైకోర్టు గట్టిగా సమర్థించింది. ప్రొఫెసర్లు, లెక్చరర్ల స్థానాన్ని ఏ ఏఐ టూల్ కూడా భర్తీ చేయలేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు నిబంధనల ప్రకారం క్లాసులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అటెండెన్స్ విషయంలో విద్యార్థులు కచ్చితమైన నిబంధనలు పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: సముద్రం కింద, పర్వతాల మధ్య..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement