breaking news
Goddess Saraswati
-
చదువుల తల్లి
ఒక ఊర్లో ఓ చిల్లరకొట్టు వ్యాపారి కొడుకు పదవ తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. చదివింది చాలని ఇకపై అంగడిని చూసుకుంటానని నాన్నకు చెప్పాడు. నాన్న ఒప్పుకోలేదు. ఎలాగైనా చదివే పని నుంచి తప్పించుకోవాలని చిన్నగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు. ‘ఎంత చదివినా నోట్లోకి నాలుగువేళ్ళు వెళ్ళడానికే కదా, ఆ డబ్బు ఈ వ్యాపారంలో సంపాదిస్తాను’ అని చెప్పాడు. తల్లి, వాడిని ఇంటి మొదటి అంతస్తుకు తీసుకెళ్ళింది. ఏమి కనిపిస్తోందని అడిగింది. మన వీధంతా కనిపిస్తోందని చెప్పాడు. రెండో అంతస్తుకు రమ్మంది. ఇప్పుడేమి కనిపిస్తోందని ప్రశ్నించింది. ఇప్పుడు మన ఊరంతా కనిపిస్తోందని బదులిచ్చాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్ళి చూపింది. ‘అరె, ఇప్పుడు మన ఊరే కాదు, దూరంగా ఉన్న కొండలు, కాలువలు కూడా కనిపిస్తున్నాయి’ అని అన్నాడు. అంతస్తులు ఎక్కేకొద్దీ మనం చాలా దూరం వరకు చూడవచ్చు. అలాగే నువ్వు పెద్ద చదువులు చదివితే పెద్ద ప్రపంచాన్ని చూడగలవు. నీకు తెలుసో లేదో మీ అమ్మమ్మ ఊర్లో ఓ తల్లి ఉంది. నేను కాదు, మన తాత ముత్తాతలకు ముందు నుంచే ఆమె చదువుతూ ఉందట. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆమె చదవడం ఆపదట. చూడాలని ఉంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళి చూడు’ అని చెప్పింది. నిత్య చదువరిగా ఉన్న ఆ తల్లి ఎవరో వెళ్లి చూద్దామని మరుసటి రోజే అమ్మమ్మ ఊరికి బయలుదేరాడు. మనవడు వచ్చాడని అవ్వ సంబరపడిపోయింది. వేడివేడిగా దోశెలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్నాక ‘ఈ ఊర్లో తరాల తరబడి చదివే ఓ తల్లి ఉందట కదా, చూసి వెళ్దామని వచ్చాను’ అని చెప్పాడు.అమ్మమ్మ నవ్వి ‘‘చదువుల తల్లి సరస్వతీదేవిని అలా అంటారు. ఆ తల్లి ఇంకా చదవడం కొనసాగిస్తూ ఉందని భక్తుల విశ్వాసం. నువ్వు బాగా చదవాలని అమ్మ అలా చెప్పి ఉంటుంది’’ అని ఊర్లోని బడి ముందర ఉన్న సరస్వతీదేవి విగ్రహం ముందరకు తీసుకెళ్ళింది. అమ్మ మాటల లోతు అర్థం చేసుకున్నాడు. ‘పెద్ద చదువులు చదువుతాను, పదిమందికీ ఉపయోగపడతాను’ అని నిర్ణయం తీసుకుని అమ్మవారికి నమస్కరించి అక్కడి నుంచి కదిలాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఓం శ్రీ శారదాయై నమః
దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, హంసను అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకధాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది.సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి.శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.మంత్రం: ’ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:’ అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా ఈ రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. నైవేద్యం: దధ్యాన్నం అంటే పెరుగన్నం, చక్కెర పొంగలి నివేదన చేయాలి.విశేషం: బెజవాడ కనకదుర్గమ్మకు నేడు సర స్వతీ మహాసరస్వతీ దేవి -
ఇదేనా ఆధునిక నాగరికత?
హిందూ పురాణాలు, భారతీయుల నమ్మకం ప్రకారం... జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని ( Goddess Saraswati) పుస్తక రూపంగా భావిస్తారు. పుస్తకం జీవన దీపికగా, నిత్యం మనకు సత్యా– అసత్యాల వాస్తవ మార్గాన్ని చూపిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్లే దారిగా నిలుస్తుంది. సంస్కృతంలో ప్రసిద్ధమైన మాట ‘పుస్తకం హస్త భూషణం’. అంటే పుస్తకం చేతికి అలంకారమని అర్థం. పుస్తకం ఉత్తమ మిత్రుడు, గురువు, తత్వవేత్త కూడా. ‘అపరిమితంగా చదివినవాడే గొప్ప వాగ్ధాటి గల వక్త కాగలడు’ అన్న మాట పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. నిస్సందేహంగా, ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకాల పాత్ర అమోఘం. రాతియుగం నుండి నేటి జనరేటివ్ ఏఐ యుగం వరకు మనల్ని నడిపించింది పుస్తకం. ఇది మన నాగరికత, శాస్త్రీయ పురోగతికి పునాది వేసినది.అయితే నేడు పుస్తకాలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పుస్తకాలను నగరాల్లోని ప్రధాన రహదారుల ఫుట్పాత్లపై అమ్మడం తెలిసిందే. కానీ పాదరక్షలను ఎయిర్ కండిషన్డ్ షోరూమ్లలో ఉంచి అమ్ముతున్నారు. ఇది చేదు వాస్తవం అయినప్పటికీ, ఎవ్వరూ ఖండించలేని పచ్చి నిజం. విద్యాసంస్థలు దేవాలయాలు అయితే, గ్రంథాలయాలు సాక్షాత్తూ గర్భగుడులే. గర్భగుడిలో ఎవరు ఉంటారో మనందరికీ తెలుసు. అందువల్ల పుస్తకాలను గౌరవంగా ప్రార్థన గదిలో కాకపోయినా, పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా గౌరవించాలి. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనఈ మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నాగరికతా? సంస్కృతా?ఆధునికీకరణ పేరుతో, మనం స్నానపు గదిలో వంట చేయలేము; వంట గదిలో స్నానం చేయలేము అనే కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఈ కార్యకలా పాలన్నీ ఇంట్లో వాటికి కేటాయించిన ప్రదేశాలలో జరగాలి. విలాసాలు, వినోదాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు కానీ వంద రూపాయలు ఖర్చుచేసి ఒక పుస్తకం కొనడానికి సంకోచిస్తున్నాడు మనిషి. పుస్తకాలకు (జ్ఞానానికి) మళ్ళీ తగిన స్థానం కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని ‘విద్యావంతులైన మూర్ఖులు’గా చరిత్ర పుటల్లో గుర్తుంచుకుంటాయి.– రెడ్డి శేఖర్ రెడ్డి గుడిశ ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు -
మనం మరిచినా.. జపనీయులు మరువలేదు!
కోల్ కతా: మీకు తెలుసా? దాదాపు 20 మంది హిందూ దేవతలు జపాన్లో నిత్యం పూజలు అందుకుంటున్నారు. చదువుల తల్లి సరస్వతికి ఆ దేశంలో వందలకొద్ది ఆలయాలు ఉన్నాయి. లక్ష్మి, ఇంద్ర, బ్రహ్మ, గణేషుడు, గరుడ మొదలైన ఎంతోమంది హిందూ దేవుళ్లను జపాన్వాసులు కొలుస్తున్నారు. భారతీయులు మరిచిపోయిన దేవుళ్లను సైతం.. వారు మరిచిపోకుండా నిత్యం పూజలు చేస్తున్నారు. వందల ఏళ్ల కిందట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు హిందూ దేవుళ్లు కూడా జపాన్కు చేరారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. అయినా అక్కడికి చేరిన హిందూ దేవుళ్లు ఇప్పటికీ జపాన్ వాసుల పూజలందుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలతో కోల్కతాలో ఇండియన్ మ్యూజియంలో విశిష్ఠ ప్రదర్శన ఒకటి ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమై.. ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన అరుదైన ఫొటోలెన్నింటినో ఇందులో ఉంచారు. జపాన్ ఫౌండేషన్, సినీ దర్శకుడు, చరిత్రకారుడు బినోయ్ కే బెహల్ సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. జపాన్ లో భారత సాంస్కృతిక మూలాలకు సంబంధించి ఎన్నో వాస్తవాలను ఈ ఫొటోలు వెల్లడిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. -
బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు. ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


