వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం.
ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం.
పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..


