102 మంది రుషుల పేర్లు.. 102 గోత్రనామాలు.. 25 చారిత్రక చిత్రాలు
45 రోజులు శ్రమించిన నేతకళాకారుడు
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై మరో అద్భుతాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. చేనేత మగ్గంపై 45 రోజులు శ్రమించి.. వాసవీమాత చరిత్రతో ఉన్న పట్టుచీరను తనదైన సృజనాత్మకతతో రూపొందించారు. చేనేత మగ్గంపై పట్టుదారం పోగులు, గోల్డ్ జరీని వినియోగించి ఏడు మీటర్ల పొడవు, 45 ఇంచుల వెడల్పు, 1200 గ్రాముల బరువైన చీర నేశారు.
గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై ఆవిష్కరించారు. ఈ చీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి చరిత్రను తెలిపే 25 చారిత్రక చిత్రాలను పట్టుపోగులతో నేశారు.
కాగా చేనేత మగ్గంపై నిత్యప్రయోగాలు చేసే హరిప్రసాద్ గతంలో 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేశారు. మగ్గంపై వేగం, నైపుణ్యం, కచ్చితత్వం, సృజనాత్మకతను సమన్వయం చేస్తూ సాధించిన ఆ ఘనత చేనేత రంగంలో ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా ఒక చీరను నేయడం ఒక కళ.
ఇదీ చదవండి: ఈ ఇంటిని మూటకట్టి పట్టుకొచ్చారు!
అయితే చరిత్రను చిత్రాలుగా, గోత్రాలను అక్షరాలుగా, రుషుల పేర్లను చేనేత డిజైన్లుగా, ఆధ్యాత్మిక భావనలను పట్టుదారంతో మగ్గంపై మలచడం అత్యంత అరుదైన కళగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికకత ఉట్టిపడే పట్టుచీరను మగ్గంపై మలచడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు.


