పానీపూరి ఫుడ్‌ పాయిజన్‌ ఘటన.. మోహన్‌లాల్‌పై కేసు! | Authorities Launch Probe After More Than 25 People Fall Ill Linked To Pani Puri In Sircilla | Sakshi
Sakshi News home page

Sircilla: పానీపూరి ఫుడ్‌ పాయిజన్‌ ఘటన.. మోహన్‌లాల్‌పై కేసు!

Jun 18 2026 8:21 AM | Updated on Jun 18 2026 11:20 AM

25 take ill after having pani puri in Sircilla

సిరిసిల్లటౌన్‌: పానీపూరి తిని పిల్లలు సహా పాతిక మంది అస్వస్థతకు గురైన ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వాళ్లంతా ఇంకా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో.. ఆ పానీపూరి అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు అయ్యింది.

మూడు రోజుల క్రితం.. మోహన్‌లాల్‌ అనే వ్యక్తి బండి వద్ద పానీపూరి తిన్న పిల్లలు, పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరికి కలెక్టర్‌ పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోంది. వైద్య అందుతున్న తీరును జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్‌ఫ్రైడ్‌ బుధవారం పర్యవేక్షించారు. 

తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో మోహన్‌ లాల్‌ అనే వ్యక్తి గత మూడేళ్లుగా పానీపూరి బండితో వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. గత సోమవారం కూడా ఎప్పటిలాగే కాలనీల్లో తిరిగి పానీపూరి విక్రయించాడు. చాలా మంది తినగా 22 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలకు ఆహారం వికటించింది. మంగళవారం ఉదయం నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరోచనాలు,, తీవ్రజ్వరం, తలనొప్పితో జిల్లా ఆస్పత్రికి వరుస పట్టారు. రాత్రి 9.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 25 మంది చేరారు. వారు తిన్న ఆహారం, నీరు కలుషితంతోనే ఫుడ్‌పాయిజన్‌ అయి ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. 

పానీపూరి విక్రేతపై కేసు 
జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. పానీపూరి విక్రేత మోహన్‌లాల్‌ ఇంటి వద్ద తనిఖీలు జరిపారు. ఫుడ్‌పాయిజన్‌ అయ్యేందుకు అవకాశం ఉండటంతో సెక్షన్‌ 56 కింద అతనిపై కేసు నమోదు చేశారు. అతను వేటితో పానీపూరి తయారు చేస్తున్నాడో పరిశీలించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆ శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పరీక్ష నిమిత్తం పంపారు.  

ప్రత్యేక వైద్య శిబిరం
ఈ ఘటన నేపథ్యంలో బుధవారం అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆశకార్యకర్తలు, వైద్య సిబ్బంది కాలనీలో ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. అవసరమైన వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఏంజెల్‌ ఆల్ఫ్రెడ్, డాక్టర్‌ నాగేంద్రబాబు, వైద్యాధికారి డాక్టర్‌ స్నేహ పరిస్థితిని సమీక్షించారు. హెచ్‌ఈవో బాలయ్య, హెచ్‌ఎస్‌ ప్రమీల, సతీశ్‌కుమార్, ఎంఎల్‌హెచ్‌పీ ఆరీఫ్, నవీన్, సంతోష్‌  పాల్గొన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు.

నిరంతర పర్యవేక్షణలో చికిత్స
ఒకేసారి 25 మంది ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రికి రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశాలతో అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు ఆస్పత్రికి వచ్చి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నా రు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించి వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశా రు. బాధితులను నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్ట ణాధ్యక్షుడు జిందం చక్రపాణి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జాలుగం ప్రవీణ్‌ పరామర్శించారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement