అమ్మ చెప్పిన కథలు
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు...
చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్.
అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి?
ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.
పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది.
గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది.
ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి.
పనిదొంగ పక్షులు
అనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి.
అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే...
‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి...
‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది.
ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది.
పాటల కథలు!
అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో విశేషం. చందమామను పిలిచే పాట ‘నిల నిల ఓడి వా’ ను పిల్లలు గట్టిగా పాడుకుంటారు. ఈ కథలు పిల్లలకు తమిళ సాంస్కృతిక విశేషాలు, ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తాయి.
‘మా అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాను. ఈ కథలను నేను మరెక్కడా వినలేదు. తన ముందుతరాల నుండి అమ్మకవి వారసత్వ సంపదగా వచ్చాయి. సంగీతంపై నాకు అవగాహన ఉన్నప్పటికీ అమ్మకు ఉన్నంత లోతైన అవగాహన లేదు. తాను కథ చెప్పే విధానానికి సంగీతం బలం అయింది. కథలను మరింత ఆసక్తికరంగా వినేలా చేసింది’ అంటారు నారాయణ్.
కథాచిత్ర ప్రపంచం
అందమైన కథలకు, అద్భుతమైన చిత్రాలు తోడైతే పిల్లలకు ఎంత సంతోషం కలిగిసాయో ఈ పుస్తకంలోని కనువిందు చేసే కలర్ పెయింట్స్ సాక్ష్యం. జానపద కథలు పుస్తకరూపంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల మార్పులకు గురవుతుంటాయి.
‘అసలు మార్పులు అవసరమా?’ అనే ప్రశ్నకు నారాయణ్ ఇచ్చే జవాబు...
‘అవసరమే లేదు’
ఎందుకంటే జానపద కథలు ఊహల ద్వారానే పాఠకులతో అనుసంధానం అవుతాయి.
‘కొన్ని విషయాలు శాశ్వతమైనవి. ఊహాలోకంలో విహరించాలనే మన ప్రేమ కూడా అందులో ఒకటి. ప్రతీదాన్ని సమకాలీకరించాల్సిన అవసరం లేదు. జానపద కథలు యథాతథ రూపంలోనే బాగుంటాయి’ అంటున్నారు నారాయణ్.
- సృజన
ఇవి చదవండి: పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా?


