అతిగా నీళ్లు తాగుతున్నారా? | Drinking Too Much Water Too Quickly Lead To Water Intoxication | Sakshi
Sakshi News home page

అతిగా నీళ్లు తాగుతున్నారా?

Oct 23 2024 1:33 PM | Updated on Oct 23 2024 1:39 PM

Drinking Too Much Water Too Quickly Lead To Water Intoxication

నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ప్రతి సెలబ్రిటీ ప్రకావంతమైన చర్మం వెనుక సీక్రెట్‌ హైడ్రేషన్‌. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం పుష్కలంగా నీళ్లు తాగడం అత్యంత కీలకం. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అలానే బ్యాలెన్స్‌గా తాగడం అనేది కూడా అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణుల మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.

అధి​​కంగా నీళ్లు తాగితే..హైపోనాట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్‌ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతలు పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్‌ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్‌. 

తగినంత సోడియం లేకుండా శరీరం సాధారణ సెల్యులార్‌ పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా బహుళ అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్‌ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలుచబడటానికి దారితీస్తుంది. 

ఫలితంగా ఎలక్ట్రోలైట్స్‌ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్‌ వాపుకి కారణమయ్యి.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్‌ ఎడెమా అంటారు. 

సెరిబ్రల్‌ ఎడెమా లక్షణాలు...

  • వికారం, వాంతులు

  • తలనొప్పులు

  • గందరగోళం

  • అలసట

  • కండరాల తిమ్మిరి

  • మూర్చ

  • కోమా, తలనొప్పి

  • చేతులు, పాదాలు లేదా ముఖంలో వాపు
     

ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్‌ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. 

ఎంత నీరు తాగితే బెటర్‌..
మనం ఉంటున్న వాతారవణం, శారీరక శ్రమ తదితర అంశాల ఆధారంగా నీటిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నిపుణులు సిఫార్సు చేసినవి..

పురుషులు: రోజుకు సుమారుగా 3.7 లీటర్లు (125 ఔన్సులు) మొత్తం ద్రవాలు (నీరు, ఇతర పానీయాలు, ఆహారంతో సహా).
మహిళలు: రోజుకు సుమారుగా 2.7 లీటర్లు (91 ఔన్సులు) మొత్తం ద్రవాలు.

ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్‌ సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ చెమట పట్టే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిది. 

(చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!)
 

Advertisement
 
Advertisement
Advertisement