Paragliding: పారా హుషార్‌.. | City People interested to Paragliding | Sakshi
Sakshi News home page

Paragliding: పారా హుషార్‌..

Nov 9 2024 7:45 AM | Updated on Nov 9 2024 7:50 AM

City People interested to Paragliding

నగరంలో పారాగ్లైడింగ్‌లో పెరుగుతున్న ఆసక్తి 

పారామోటారింగ్, గ్లైడింగ్‌ నేర్చుకుంటున్న యువత 

హాబీతో పాటు కెరీర్‌గా ఎంచుకుంటున్న పలువురు 

పారాగ్లైడింగ్‌లో చుక్కానిగా నిలుస్తున్న హైదరాబాదీ 

ఈజిప్టు పిరమిడ్స్‌పై ఎగిరిన తొలి భారతీయుడిగా రికార్డు 

రియో విగ్రహం, అమెజాన్, నైల్‌ నదులపై పారాగ్లైడింగ్‌

సాధారణంగా పారాగ్లైడింగ్‌ అనేది పర్యాటకప్రాంతాల్లో మాత్రమే ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా అది నేర్చుకుంటే ఏం వస్తుందిలే అన్న భావన కూడా ఉంది. అయితే మనకు పారాగ్లైడింగ్‌ గురించి కనీసం అవగాహన లేని సమయం నుంచే ఇందులో మెళకువలు నేర్చుకుని నగర యువతకు చుక్కానిగా నిలుస్తున్నారు హైదరాబాదీ ప్రభు సుకుమార్‌ దాస్‌. చిన్నతనం నుంచే గ్లాలో ఎగరాలనే తన కోరికను పారాగ్లైడింగ్‌తో సాకారం చేసుకున్నాడు.

రెక్కలు తొడిగి... 
ప్రయాణాలు అంటే ఇష్టంతో ముందుగా బుల్లెట్‌ బైక్‌పై ఐదు దేశాలు తిరిగాడు. అదే సమయంలో పారాగ్లైడింగ్‌ గురించి తెలుసుకుని, నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో  పారాగ్లైడింగ్‌లో అద్భుతాలు సృష్టించాడు. పారాగ్లైడింగ్‌ చేస్తూ ఈజిప్టులోని గ్రేట్‌ పిరమిడ్స్, బ్రెజిల్‌లోని రియో క్రీస్ట్‌ విగ్రహం, అట్లాంటిక్‌ సముద్రంతో పాటు అమెజాన్‌ నది, నైలు నది, ఎర్ర సముద్రంపై ఎగిరిన తొలి భారతీయుడిగా  రికార్డులకెక్కారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక నుంచి రాజస్థాన్‌ వరకూ పాదయాత్రను ఎగురుకుంటూ ఫాలో అయ్యారు. దీంతో రాహుల్‌ గాంధీ తనను ప్రత్యేకంగా అభినందించారని సుకుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఎంతో మందికి శిక్షణ..
పారాగ్లైడింగ్‌ చేస్తే వచ్చే అనుభూతి వేరని చెబుతున్న సుకుమార్‌.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇచ్చాడు. పారాగ్లైడింగ్‌లో కూడా మంచి భవిష్యత్తు ఉందని, ఎంతోమంది పారాగ్లైడింగ్‌లో శిక్షణ తీసుకుని విదేశాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది పారాగ్లైడింగ్‌ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ పిల్లలకు పారాగ్లైడింగ్‌లో ఉచితంగా తర్ఫీదునిచ్చాడు. వారంతా నేషనల్‌ పారామోటార్‌ చాంపియన్‌íÙప్‌లో పాల్గొన్నారని, అప్పుడు వారి కళ్లల్లో చూసిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచి్చందని సుకుమార్‌ చెబుతున్నాడు. ఎంతోమంది కలలను నిజం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని పేర్కొంటున్నాడు.  

భవిష్యత్తులో ఎగిరే పోలీసులు..
విపత్తుల వేళ పారాగ్లైడింగ్‌ చేసే వారికి ఎంతో డిమాండ్‌ ఉంటుందని సుకుమార్‌ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు కూడా వస్తారని అంటున్నాడు. ఇప్పటికే తాము నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చానని వివరించాడు. ఇక, తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలో ప్రత్యేక పండుగల సందర్భంగా పారాగ్లైడింగ్‌ చేస్తూ వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేసేలా సుకుమార్‌ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ, సంక్రాంతి పండుగల వేళ పారాగ్లైడింగ్‌తో వాటి ప్రాముఖ్యత తెలిసేలా చేశాడు. ఇక, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా చేసే పారాగ్లైడింగ్‌లో ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. 

Advertisement
 
Advertisement
Advertisement