సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్‌ | Sakina Foundation doing many services for the better society | Sakshi
Sakshi News home page

సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్‌

Mar 4 2025 11:02 AM | Updated on Mar 4 2025 11:22 AM

Sakina Foundation doing many services for the better society

 పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం

 వలస కూలీలకు మాషా అల్లా పేరిట కిచెన్‌ 

సకీనా ఫౌండేషన్‌ ద్వారా మహిళా సాధికారతకు కృషి 

సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో 
ఉంటున్నాడు..  – గోల్కొండ 

 

నగరంలో అది పెద్ద లేబర్‌ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్‌ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్‌ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్‌ హుసేన్స్‌న్‌ సోహెల్‌ సూర్యనగర్‌ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్‌ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. 

వలస కూలీలకు అండగా.. 
ఆసిఫ్‌హుస్సేన్‌ సోహెల్‌ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్‌హుస్సేన్‌ సోహెల్‌ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్, ఫస్ట్‌ ఎయిడ్, జిగ్‌జాగ్, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి  చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.  

కరోనా సమయంలో.. 
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్‌ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్‌ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్‌ చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement