సాగుబడి
సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల పెంపకంలో నిరంతర పోషణ ముఖ్యమైన విషయం. ఇందుకు ఉపయోగపడే ద్రావణం ఆల్–ఇన్–వన్ లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది అన్ని మొక్కలకూ ఉపయోగపడుతుంది. పొటాషియంతో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తుంది.
1. ఒక బకెట్లో 2–3 లీటర్ల బియ్యం కడిగిన నీటిని తీసుకొని అందులో 4–5 అరటి తొక్కలు, రెండు గుప్పిళ్ల ఉల్లిపాయ పొట్టు వేయాలి.
2. ఈ మిశ్రమాన్ని 2–3 రోజులు నీడలో ఉంచాలి (రోజూ ఒకసారి కలపాలి).
3. మూడు రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి, ఒక వంతు ద్రావణానికి రెండు వంతుల సాధారణ నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.
4. గులాబీ, మందార లాంటి పువ్వులు మొక్కలు మొగ్గలు వచ్చే సమయంలో పైన చెప్పిన అరటి తొక్కల నీటిని వారానికి ఒకసారి ఇస్తే పూలు పెద్దవిగా పూస్తాయి.
5. టమోటా, మిర్చి, బెండ లాంటి కూరగాయ మొక్కలు పూత, పిందె మీద ఉన్నప్పుడు ఈ ఎరువు ఇస్తే కాయలు రాలిపోకుండా బలంగా పెరుగుతాయి.
6. ఆకుకూరలకు పొటాషియం కంటే నత్రజని (నైట్రోజన్) ఎక్కువ అవసరం. కాబట్టి, వీటికి బియ్యం కడిగిన నీరు లేదా పప్పులు కడిగిన నీరు సరిపోతుంది.
7. ఇండోర్ ΄్లాంట్స్కు నెలకు ఒకసారి మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో ఈ ఆల్–ఇన్–వన్ ద్రవ ఎరువును ఇవ్వాలి.
8. ద్రవ ఎరువులు తయారు చేసిన 3–4 రోజుల్లోనే వాడేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే వాసన వస్తుంది.
9. ఎరువు వేసే ముందు మొక్క మొదల్లో మట్టి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే వేయాలి. ఎండలో వేయకూడదు.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


