ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా చేస్తున్న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు
ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
ఏలూరు (టూటౌన్): ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద దురహంకార వైఖరిని ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాత బస్టాండ్ వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అధికారం అమెరికాకు లేదన్నారు. ఆయిల్ నిలవలుండే దేశాలపై గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అడ్డగోలు వాదన చేస్తూ యుద్ధం పేరుతో అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, కె.శ్రీనివాస్, నగర కార్యదర్శి పంపన రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ దాడికి ఖండన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఇఫ్టూ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


