
అమెరికాతో ఒప్పందం మరణ శాసనం
ద్వారకాతిరుమల: అమెరికాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాడి, వ్యవసాయ రంగాలకు మరణ శాసనమని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ఈ ఒప్పందం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేపట్టిన భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ ‘వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు’ నినాదంతో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు సోమవారం ఆందోళన చేశారు. వాన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సుంకాలు, మార్కెట్ పరిమితులు తొలగిస్తే అమెరికా పాడి ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అయ్యి ఇక్కడి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అలాగే అమెరికా ఉత్పత్తులతో దేశంలో వ్యవసాయ రంగం దెబ్బతింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, నాయకులు పాల్గొన్నారు.
డీఎస్సీకి దరఖాస్తులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వి డుదల చేసిందని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రక టనలో తెలిపారు. అభ్యర్థులు మే 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారని, వివరాలు సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్, ఏపీడీఎస్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్లో అందుబాటులో ఉన్నాయన్నారు.