ఇది సర్కారీ నిర్లక్ష్యం! | Visakhapatnam steel plant accident claims the lives of 8 workers | Sakshi
Sakshi News home page

ఇది సర్కారీ నిర్లక్ష్యం!

Jun 10 2026 2:52 AM | Updated on Jun 10 2026 2:52 AM

Visakhapatnam steel plant accident claims the lives of 8 workers

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది. సోమవారం సాయంత్రం స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)–1లో ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌లో హఠాత్తుగా విస్ఫోటం సంభవించి, అక్కడ పనిచేస్తున్న 8 మంది క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగలగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

1,600 డిగ్రీల సెల్సియస్‌తో సలసలకాగుతున్న ఆ ఉక్కు ద్రవం... సమీపంలోని భారీ క్రేన్‌పై పడి అది పూర్తిగా దగ్ధమైందంటే దాని తీవ్రత ఎంతటిదో గ్రహించవచ్చు. ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించిన పర్యవసానంగా చోటుచేసుకున్న ఈ మరణాలు నిజానికి హత్యలు. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబు పత్తాలేరు. ముందురోజు వెళ్లిన హోంమంత్రి అనిత కార్మిక కుటుంబాలను పలకరించే ధైర్యం లేక అట్నుంచి అటే పలాయనం చిత్తగించారు.  

లోకేశ్, పవన్‌ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘అకటా వికటపు రాజుకు అవివేకపు మంత్రులు, చాదస్తపు పరివారం...’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. అందుకు తగినట్టే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్ప లేక, రంకెలేస్తూ ‘మీకెందుకు... మీ ఇంట్లో ఎవరైనా పోయారా?’ అంటూ లోకేశ్‌ మాట్లా డిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనం. రెండేళ్లనుంచి మంత్రిగా ఉన్నా పవన్‌ అపరిపక్వతను వదుల్చుకోలేకపోతున్నారని ఆయన తీరు తేటతెల్లం చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తే తానే అడ్డుకున్నారట. 

ఘటన జరిగిన కర్మాగారం ఏమిటో, అది ఎవరి అధీనంలో ఉంటుందో కూడా ఆయనకు తెలియ దన్నమాట! పైగా పోరాడదామంటే కార్మికులు కదల్లేదట!! ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత, ఇలా చవకబారు మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గనిపించలేదు. పైగా 2021లో దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటే అప్పటి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంఅసెంబ్లీలో తీర్మానం చేయించి అడ్డుకుందని అదే నగరంలో కేంద్ర ఉక్కుగనుల మంత్రి హెచ్‌డి కుమారస్వామి చెప్పి ఇంకా 24 గంటలు గడవకుండానే అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి!

ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వచ్చినవారిపై సహజంగానే ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయి. పైగా విశాఖ ఉక్కును రక్షిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చినవారు గనుక, మీరేం చేశారని ప్రశ్నిస్తారు. ‘అప్రయోజకుడికి అహంకారం ఎక్కువన్న’ట్టు గొంతు చించుకుని దబాయిస్తే కార్మికలోకం నోరుమూసుకుని పడి ఉంటుందని లోకేశ్‌ అనుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు వేలమంది ఉద్యోగులతో కళకళ్లాడుతూ ఉత్పాదనలో దేశంలోనే నంబర్‌ వన్‌గా, నవరత్నాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా చిదిమేస్తుంటే... ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతుంటే నిలదీయటం నేరమా? ఇంతవరకూ కర్మాగారంలో 7,500 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించారు. 

నిపుణులైన 6,000 మందిని పనిలో నుంచి తీసేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట మరో 2,000 మందిని పంపేశారు. మరోపక్క ఉత్పాదకత పెంచాలని కార్మికుల్ని వేధిస్తున్నారు. 30 ఏళ్లనాటి బ్యాటరీలేఇంకా వినియోగిస్తుండగా, కొన్ని విడి భాగాలు పనికి రాకుండా పోయాయని చెప్పినా అరణ్యరోదనైంది. పైగా విశాఖ ఉక్కు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉక్కు తయారీలో నాసిరకం రసాయనాలను వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత విషాద ఘటనకు ఇవన్నీ కారణమే. 

అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నట్టు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఇదే నగరంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెనువెంటనే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున అంద జేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో డ్రామాలు కట్టిపెట్టి దాని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి.  

Advertisement
 
Advertisement
Advertisement