ఈ ఏడాది వానలు ముఖం చాటేస్తున్నాయి. రైతుల కళ్లల్లో దిగులు మబ్బులు కనిపిస్తున్నాయే గాని, ఎక్కడా చినుకుల సవ్వడి వినిపించడం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుంటే, చాలినన్ని తిండి గింజలు పండక కరవు కాటకాలు తప్పవు. అనావృష్టి తెచ్చిపెట్టే కరవు కాటకాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తాయి. ప్రధానంగా మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాన్నే నమ్ముకుని, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కర్షక జనాభా వర్షాభావం వల్ల కష్టాల్లో పడితే, యావత్ దేశానికే కష్టాలు తప్పవు. వర్షాల కోసం క్రమం తప్పక యజ్ఞయాగాదులు చేసే సంస్కృతి మనది. వర్ష ప్రాధాన్యం పట్ల ఎరుక కలిగిన జాతి మనది. ‘అనావృష్టి మతీత్యైవ మహతీ వర్షసంతతిః/ భూతానాం సంక్షయం చక్రే దుర్భిక్ష పరిపీడితమ్’ అని విష్ణుపురాణం చెబుతోంది. అనావృష్టి వల్ల పంటలు పండక దుర్భిక్షంతో మనుషులే కాదు, సమస్త ప్రాణులూ సంక్షోభానికి, నాశనానికి లోనవుతాయి.
కరవు కాటకాలు మన దేశానికి కొత్త కాదు. వానలు లేక, నేల నెర్రెలు పడిన దుర్భర దుర్భిక్ష వర్ణనలు మన పురాణ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు!’ అంటూ ‘పెన్నేటి పాట’ రాసిన విద్వాన్ విశ్వం ఒకనాటి రాయలసీమ కరవు దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రించారు. కరవు కాటకాలను ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇదివరకు ఉండేది కాదు. అందువల్ల దుర్భిక్షాన్ని దైవఘటనగానే పరిగణించేవారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితు లను; అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందు గానే గ్రహించి, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయగలుగుతున్నారు.
పాలకులు బాధ్యతనెరిగిన వారైతే, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకుని కార్యాచరణను ప్రారంభిస్తారు. పాలకులు బాధ్యతను మరచి, హాలికులను వారి కర్మానికి వారిని విడిచిపెడితే, దుర్భిక్ష పర్యవసానాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వేసవిలోనే హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు ఒకవైపు రైతులలో గుబులు పెంచుతుంటే, మరోవైపు చీకటి వ్యాపారులలో, రాజకీయ దళారులలో, అవినీతిలో మునిగితేలే అధికార గణాల్లో సంబరాన్ని పెంచుతున్నాయి. కరవును కూడా సొమ్ముచేసుకోగల సమర్థులు మనకు కొత్త కాదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని గురించే పాత్రికేయుడు సాయినాథ్ ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్’ పుస్తకాన్ని ముప్పయ్యేళ్ల కిందటే రాశారు.
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నేలను నమ్ముకున్న రైతు కలలోనైనా కరవు కాటకాలను కోరుకోడు. రోజువారీ పనులు చేసుకుంటూ అన్నం తిని బతికే సామాన్య ప్రజలు కూడా కరవు కాటకాలను కోరుకోరు. ప్రతి సంక్షోభాన్నీ స్వీయ సంక్షేమ అవకాశంగా మార్చుకొనే దౌర్భాగ్యులే దుర్భిక్షాన్ని కోరుకుంటారు. ‘వార్ధుషికః వణిగ్బంధుః యే చ ప్రభూతమన్న సంగ్రహం/ కృత్వా దుర్భిక్షం వాంఛంతి తే పి వార్ధుషికా’ అని ప్రాచీన సుభాషిత శ్లోకం చెబుతుంది. వర్తకులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, జనాలను పీడించే వడ్డీ వ్యాపారులు దేశంలో కరవు కాటకాలు రావాలని కోరుకుంటారని ఈ శ్లోక సారాంశం. ఇప్పటి కాలంలో వడ్డీ వ్యాపారులకు జతగా కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, రాజకీయ దళారులు, లంచగొండి అధికారులు కూడా జనాలకు దాపురించారు.
వీళ్లందరూ కరవులో అధికమాసం లాంటివారు.ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ కారణంగా భారత్ సహా ఎనభై ఎనిమిది దేశాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడనున్నాయి. ఇది కేవలం ప్రకృతి పరిణామం మాత్రమే కాదు, ఇంగితం లేని పాలకుల చర్యలకు పర్యవసానం కూడా! భూతాపం పెరుగుదలపై పర్యావరణవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, కొందరు దేశా«ధినేతలు యుద్ధ విధ్వంసాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు ఊత మిస్తున్నారు. ఈకాలం దుర్భిక్షం బాధ్యతెరుగని పాలకుల స్వార్థఫలం.


