రాష్ట్ర వ్యవసాయం కొత్త పుంతలు
ఫోన్ యాప్లు విరివిగా ఉపయోగిస్తున్న రైతన్నలు
‘ఫార్మ్ప్రై సెజ్, కృషివాస్, ఫీల్డ్వైజ్ల ద్వారా అలర్ట్లు
అరచేతిలోనే వాతావరణ, చీడపీడల గురించిన సమాచారం
పంటల పరిరక్షణ..అధిక దిగుబడి పొందుతున్న రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 22 గ్రామాల్లో దూసుకుపోతున్న ‘కృషివాస్’
వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ‘ఫార్మ్ప్రై’, ఫీల్డ్వైజ్
రాష్ట్రంలో వ్యవసాయం ‘స్మార్ట్’గా మారుతోంది. సాగు ఆధునికతను సంతరించుకుంటోంది. యంత్ర పరికరాలకు తోడుగా ఫోన్ ఆధారిత వ్యవసాయం పెరుగుతోంది. రైతన్నలు వివిధ రకాల యాప్లను వినియోగిస్తున్నారు. పంటల సాగులో మెళకువలు తెలుసుకుంటున్నారు. వాతావరణ హెచ్చరికలు గమనిస్తున్నారు. చీడ పీడల గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు. పెట్టుబడిని తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి పొందుతున్నారు.
ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో రైతు చేతిలోని ఫోన్నే పంటల సాగుకు ఉపకరిస్తోంది. ‘ఈ పొలంలో 3 రోజుల్లో చీడ దాడి చేసే అవకాశం 80 శాతం ఉంది..’అంటూ తెలుగులో వాయిస్ అలర్ట్ నేరుగా రైతుకు వస్తోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ రైతులు దిగుబడి పెంచుకుంటున్నారు. ప్రభుత్వం, స్టార్టప్లు కలిసి రాష్ట్ర వ్యవసాయాన్ని స్మార్ట్గా మారుస్తున్నాయి.
ఎప్పటికప్పుడు అలర్ట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని 22 గ్రామాల్లో ఇప్పటికే ఏఐ విప్లవం మొదలైంది. ఇక్కడ 56 వేల ఎకరాలు, 15 వేల మంది రైతులతో ‘కృషివాస్’యాప్ ప్రయోగాత్మకంగా నడుస్తోంది. ఉపగ్రహం ద్వారా వచ్చే డేటాను బట్టి పొలంలో నీటి కొరత, పోషకాల లోపం, చీడపీడల దాడిని 3 ్ఠ 3 మీటర్ల కచ్చితత్వంతో ముందే గుర్తిస్తోంది. ఈ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
మరోవైపు వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ‘ఫార్మ్ప్రై’సెజ్ యాప్ను రైతులు విరివిగా వాడుతున్నారు. వాటర్షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ డేటా ప్రకారం ఈ యాప్లోని ఏఐ చీడపీడల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా పత్తి, సోయాబీన్ రైతులు తెగులు వచ్చే 7–10 రోజుల ముందే హెచ్చరిక అలర్ట్ అందుకుంటున్నారు. దీనివల్ల అనవసరంగా పురుగుమందులు కొట్టడం తగ్గి, ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదా అవుతోంది. యాప్ తెలుగులో ఉండటంతో చదువు తక్కువ ఉన్న రైతులు కూడా సులభంగా వాడుతున్నారు.
⇒ ఫీల్డ్వైజ్ యాప్లో ఆకు ఫొటో పెడితే వెంటనే సమాధానం వస్తుంది. ఏ తెగులో గుర్తించి ఏ మందు వాడాలో సూచిస్తుంది. ఉపగ్రహం, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జీఐఎస్ డేటాను కలిపి పంట ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. తెలుగులో వాయిస్ ద్వారా సలహాలు ఇచ్చే జీఏఐ చాట్బాట్ కూడా ఉంది. గత ఏడాది చీడ వల్ల నష్టపోయా. ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డా. ఏఐ లేకపోతే ఇంత లాభం వచ్చేది కాదు. – నాయుడు, రైతు, చెన్నిపాడు గ్రామం, మనోపాడ్ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
వాతావరణం తెలుసుకుంటున్నా..
కృషివాస్ యాప్ ద్వారా వాతావరణం, మార్కెట్ రేట్లు రోజూ తెలుసుకుంటున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే ఎరువులు వేసుకునే విషయంలో జాగ్రత్త పడొచ్చు. పిల్లాడు ఫోన్లో నేరి్పంచాడు. ఇప్పుడు నేనే అందరికీ చెబుతున్నా. – మారెప్ప, రైతు, సల్కాపురం, గట్టు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
సాగు ఖర్చు 20% తగ్గింది
గతంలో పురుగు ఆశించిన తర్వాతే తెలిసేది. ఇప్పుడు ఫార్మ్ప్రై సెజ్ యాప్లో ఏఐ అలర్ట్ వచ్చిన వెంటనే స్ప్రే చేస్తున్నా. 5 రోజుల వాతావరణ సూచన, మార్కెట్ ధరలు. పత్తి, సోయాబీ¯న్లో చీడపీడలను ముందే అంచనా వేసే హెచ్చరిక వ్యవస్థ ఇందులో ఉంది. ఫొటో తీసి అప్లోడ్ చేస్తే ఏ తెగులు, ఏ మందు కొట్టాలో చెబుతుంది. నా 5 ఎకరాల పత్తి సాగులో ఈసారి ఖర్చు 20% తగ్గింది. యాప్లో తెలుగు భాషా సౌలభ్యం ఉండటం వల్ల మా నాన్న కూడా యాప్ను సులభంగా వాడుతున్నారు.
– చాకలి నరేష్, యువ రైతు, ఐనెల్లి గ్రామం, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లా
శుభ పరిణామం
జిల్లాలో రైతులు వివిధ యాప్లు వినియోగిస్తున్నారు. టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నారు. కొంత మంది రైతులు తమ పిల్లల ద్వారా నేర్చుకుంటున్నారు. ఈ యాప్ల వల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరుతోంది. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో జరగకున్నా ఇదొక మంచి పరిణామం. - ఎం.సుజాత, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి
విదేశాల్లో ఇలా..
అమెరికాలో ప్లాంట్విలేజ్ నురు యాప్ ఆకు ఫోటో తీస్తే 96% కచ్చితత్వంతో తెగులును గుర్తిస్తుంది. నెదర్లాండ్స్లో ఫామ్21 + ఏఐ వ్యవస్థ సెన్సార్ల ద్వారా డేటాను విశ్లేషించి వాట్సాప్లో హెచ్చరిక పంపుతుంది. టమోటా, మిర్చి పంటల్లో 30% దిగుబడి పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.


