అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి | A young man died in the shooting in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి

Jun 24 2024 4:01 AM | Updated on Jun 24 2024 4:00 AM

A young man died in the shooting in America

సూపర్‌ మార్కెట్‌లో ఘటన 

గోపీకృష్ణ మృతి పట్ల  వైఎస్‌ జగన్‌ సంతాపం

కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హెచ్‌–1బి వీసా రావటంతో  సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు. 

ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్‌ రాష్ట్రం డల్లస్‌ సిటీలోని సూపర్‌ మార్కెట్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్‌ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేర్పించారు. 

చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లి కతో వివాహం జరిగింది. వీరికి ఏడాది న్నర కుమారుడు ఉన్నాడు. ్రప్రజాప్రతి నిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ కుటుంబసభ్యులు కోరుతున్నారు.   

గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
అమెరికాలోని సూపర్‌ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement