
గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడమేంటని పట్టుపట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని భార్యకు తేల్చిచెప్పాడు. ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.
తన మాట విననందుకు కుటుంబ సభ్యుల్ని పిలిపించింది భార్య. ఈ విషయంలో భర్తతో అమీతుమీ తేల్చుకోవడాని సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవపడ్డాడు.. అయితే భర్తపై భార్య తరఫు బంధువులు దాడికి దిగారు. తన కొడుకును ఒక్కడిని చేసి దాడి చేస్తున్నారని తల్లి పరుగెత్తుకొచ్చింది. కొడుకును రక్షించాలని తాపత్రాయపడింది. మరి కోడలు ఊరుకుంటుందా.. అత్తను జట్టు పట్టుకుని కిందకు పడేసింది. పడిపోయిన అత్తపై మళ్లీ మళ్లీ దాడి చేసింది సదరు కోడలు.
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన విశాల్ బత్రా, నీలిక భార్యా భర్తలు. వీరితో కలిసి విశాల్ తల్లి ఉంటోంది. 70 ఏళ్లు పైబడ్డ వయుసులో కొడుకును ఆశ్రయించింది. తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్.. తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే కోడలు ఊరుకోలేదు. ఎంతకాలం ఈ ముసలామెను ఇంట్లో ఉంచుతావంటూ భర్తతో పదే పదే గొడవ పడేది. ఇలా ఏడాదికి పైగానే గడిచింది. ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు.
దాంతో ఆగ్రహించిన భార్య.. తన బంధువుల్ని గొడవకు పురామాయించింది. ఎలాగైనా సరే అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకుని కూర్చొంది. విశాల్ ఇంటికి వచ్చిన ‘పెద్దలు’( భార్య తరప/ బంధువులు) అతనిపై దాడికి పూనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ పై దాడికి దిగారు. దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి యత్నించింది. ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆ పెద్దామెను జట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె కిందపడిపోయినా మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనను ఇండియన్ ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ తో సహా పలు జాతీయ చానళ్లు వెలుగులోకి తెచ్చాయి.
Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr
— IANS (@ians_india) April 4, 2025
నా భార్య వేధిస్తోంది.. చివరకు దాడి చేసింది..
దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశాల్.. బయట మీడియాతో మాట్లాడారు. ‘ నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను. సుమారు 10 నుంచి 15 మంది వరకూ నా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మపై దాడి చేశారు. నా తల్లిని బయటకు పంపేయమని నా భార్య వేధిస్తోంది. దీన్ని నేను కాదనడంతో నాపై దాడికి చేయించింది. నీలిక సోదరుడు, తండ్రి కలిసి మమ్మల్ని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజూ తీవ్రంగా తిడుతూ ఉంటోంది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను’ అని విశాల్ తెలిపాడు.