పెద్ద కూతురు రాసిన మరణ శాసనం.. ట్రిపుల్‌ మర్డర్ కలకలం! | Tragedy in Bangalore: Three family members die | Sakshi
Sakshi News home page

పెద్ద కూతురు రాసిన మరణ శాసనం.. ట్రిపుల్‌ మర్డర్ కలకలం!

Jun 23 2026 7:42 PM | Updated on Jun 23 2026 7:52 PM

Tragedy in Bangalore: Three family members die

సాక్షి,బెంగళూరు: సహజీవనం తప్పమ్మా?. అన్ని లక్షలు అప్పు ఎందుకైంది? అని ప్రశ్నించినందుకు పెద్ద కుమార్తె ఇంటికి శాపంగా మారింది. కనీపెంచిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సొంత చెల్లెల్ని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పెద్ద కుమార్తె ఘాతుకానికి పాల్పడుతుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అటు తల్లిదండ్రులు, ఇటు చెల్లెల్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే వెంటపడి మరి ప్రాణాలు తీసింది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సిలీకాన్‌ వ్యాలీ సిటీగా పేరొందిన బెంగళూరులో చోటు చేసుకుంది.

సోమవారం జరిగిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ, కుటుంబ విభేదాలు, అప్పుల భారం, ఆవేశం.. ఇవన్నీ కలిసి చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.

కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి ప్రాంతంలోని సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (20) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలోని పెద్ద కుమార్తె శ్వేత,ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.

ప్రేమకు కుటుంబం అడ్డుగా మారిందా?
శ్వేత కొంతకాలంగా కెన్నెత్‌తో సహజీవనం చేస్తోంది. తీరు మార్చుకోవాలని పెద్ద కుమార్తెను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇదే కుటుంబంలో తరచూ గొడవలకు కారణమైంది. ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు చేసింది. ఈ అప్పుల గురించి తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్న సమయంలో శ్వేత, కెన్నెత్ అక్కడికి వెళ్లారు. ముగ్గురి మధ్య మాట మాట పెరిగింది. ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు.  హత్య అనంతరం కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు.   కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చెల్లెలు సుప్రియపై కూడా దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్వేత ఆమెను అడ్డుకోగా, కెన్నెత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడని అనుమానిస్తున్నారు.

అనంతరం ఇంటికి చేరుకున్న సోమసుందర్‌పై కూడా అదే ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ఇంటి బయటకు పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన కూడా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో భార్య, ఇద్దరు కుమార్తెలు, తండ్రి మధ్య చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఒకప్పుడు ప్రేమగా పెంచిన కూతురిపైనే ఇప్పుడు హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమకు వ్యతిరేకత, అప్పుల ఒత్తిడి, కుటుంబ కలహాలు... ఏది అసలు కారణమో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించినప్పటికీ, మరిన్ని వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక అసలు నిజం ఏమిటి? ప్రేమా... అప్పులా... లేక ఇంకేదైనా కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు పూర్తయ్యాకే తెలిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement