ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల అదృశ్యం | Three B.Tech students missing | Sakshi
Sakshi News home page

ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల అదృశ్యం

Dec 24 2024 7:45 AM | Updated on Dec 24 2024 7:45 AM

Three B.Tech students missing

    గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆలస్యంగా వెలుగులోకి.. 

    కేసు నమోదు చేసిన పోలీసులు  

ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌ పరిధిలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్‌ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

 వికారాబాద్‌ జిల్లా, మోమిన్‌పేట మండలం రాంనాథ్‌గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్‌రాజ్‌ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ విద్యాసంస్థల్లో బీటెక్‌ (సీఎస్‌సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు.14న హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్‌రాజ్‌ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్‌కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్‌ కాలేజ్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. 

ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్‌ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement