13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్‌ కిల్లర్‌ హస్తం? | 13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్‌ కిల్లర్‌ హస్తం? | Sakshi
Sakshi News home page

13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్‌ కిల్లర్‌ హస్తం?

Aug 8 2024 7:02 PM | Updated on Aug 8 2024 7:29 PM

13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్‌ కిల్లర్‌ హస్తం?

ఉత్తరప్రదేశ్‌లో మహిళల వరుస హత్యలు ఆందోళన రేపుతున్నాయి. బరేలీజిల్లాల్లోని గ్రామీణప్రాంతాల్లో గత 14 నెలలుగా 9 మంది మహిళలు ఒకేలా హత్యకు గురుయ్యారు. మరణించిన మహిళల వయసు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉండటం గమనార్హం.  అయితే వీరందరి మరణాల వెనక ఓ సీరియల్‌ కిల్లర్‌ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షాహీ, షీష్‌గఢ్‌, షెర్‌గఢ్‌.. ఈ మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని మహిళలే టార్గెట్‌గా ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారి చీరలతోనే గొంతు నులిమి చంపినట్లు బయటపడింది. . అయితే మృతులను  దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. కానీ.. ఎవరిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. వరుస హత్యలతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గత ఏడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్‌లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి. అయితే హత్యల వెనక అనేక అంశాలు ఒకేలా ఉండటంతో ఈ కేసుల్లో సీరియల్‌ కిల్లర్‌ హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. 

అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి  ఒక్క హత్య కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది.

 మరో హత్యతో..
7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జూలై  9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో తేలింది.

దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి తెలిపారు.  హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను తాజాగా విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement