
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు జలకళను సంతరించుకోవడంతో వీటిని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలువురు ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాలు.. పెద్దపల్లి మండలం సబితం జలపాతం(గౌరీ గుండాల జలపాతం) వద్ద బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి యువకుడు మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు.
జలపాతం వద్ద ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.
చదవండి: ముగ్గురి హత్యలతో విషాదంగా ముగిసిన లాక్డౌన్ ప్రేమ.. చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్కు