భారతీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు అందించింది. గత సెప్టెంబర్లో వాయిదా పడిన జీతాల పెంపును ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసికానికి గాను 100 శాతం వేరియబుల్ పేను కంపెనీ ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఫిబ్రవరి జీతంతో కలిసి అందుతుంది. అయతే, జీతాల పెంపు ఎంత శాతం ఉంటుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఐటీ రంగంలో వేచి చూసే ధోరణి
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ భయాల కారణంగా ఐటీ రంగంలో వ్యాపార పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. టీఈఎస్ ఏప్రిల్లో ఇవ్వాల్సిన పెంపును సెప్టెంబర్కు వాయిదా వేసి మెజారిటీ ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు పెంపును ఇచ్చింది. కాగ్నిజెంట్.. ఆగస్టులో జరగాల్సిన పెంపును నవంబర్కు వాయిదా వేసింది. ప్రధాన ఐటీ సంస్థల్లో పెంపును ప్రకటించిన చివరి కంపెనీగా విప్రో నిలిచింది.
ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు


