దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031 నాటికి 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 1,380 జీసీసీల ఏర్పాటుకు దోహపడేలా ప్రత్యేక విధానాలను రూపొందించాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ రాష్ట్రాలు.. విశిష్ట జీసీసీ పాలసీలను రూపొందించడంలో భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యంత అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించాయని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతీయ సర్వీసుల వ్యవస్థకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటాన్ని ఇది తెలియజేస్తోందని వివరించారు. రాష్ట్రాలు నిర్దిష్ట ప్రోత్సాహకాలు, వేగవంతంగా అనుమతులు, దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను కల్పించే హామీలు మొదలైనవి కల్పించడం ద్వారా జీసీసీలను స్వాగతించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
కర్ణాటక 3.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే యోచనతో 500 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది.
మహారాష్ట్ర 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా 200 జీసీసీలను లక్ష్యంగా నిర్దేశించుకుంది.
గుజరాత్ 50,000 ఉద్యోగావకాశాల కల్పనతో 250 జీసీసీలను, కేరళ 1.6 లక్షల కొలువు లక్ష్యంతో 80 జీసీసీలను టార్గెట్గా పెట్టుకుంది.
అలాగే మధ్యప్రదేశ్ 37,000 ఉద్యోగాల కల్పన కోసం 50 జీసీసీలను సాధించాలని నిర్దేశించుకుంది.
జీసీసీ ఉద్యోగుల కోసం తమిళనాడు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది.
తెలంగాణ, ఢిల్లీ కూడా జీసీసీ వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి.
ఈ పరిశ్రమ కోసం నిర్దిష్ట విధానాలను రూపొందించడంపై ఇతరత్రా పలు రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి. కేరళ ముసాయిదా జీసీసీ పాలసీలను ప్రతిపాదించింది.
2022 నుంచి 2026 తొలి ఆరు నెలల వ్యవధి మధ్య భారత్లోని టాప్ 9 నగరాల్లో జీసీసీలు 12.3 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి.


