
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో ముందడుగు వేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ వేగంగా దూసుకుపోతుంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్), అసెంబ్లింగ్ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయం కోసం కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విభాగంలో ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాల కోసం తైవాన్కు శిక్షణ నిమిత్తం పంపుతున్నట్లు ఈ పరిణామాలపై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు.
టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో సెమీకండక్టర్లకు సంబంధించిన ఫ్యాబ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. దీన్ని నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ కోసం తన టెక్నాలజీ భాగస్వామిగాఉన్న తైవాన్కు చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ)కు 200 మంది ఉద్యోగులను పంపింది. పీఎస్ఎంసీలో ఒకేసారి శిక్షణ ఇచ్చేవారి సంఖ్య పరిమితం కావడంతో కంపెనీ నిర్మాణాత్మక ప్రణాళికను అనుసరిస్తోంది.
ఇదీ చదవండి: చాట్జీపీటీ డౌన్.. ఆఫీస్లో ఉద్యోగులు రిలాక్స్!
ఇకపై ప్రతిసారి 50 నుంచి 75 మందిని శిక్షణకు పంపించాలని నిర్ణయించింది. ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ రూ.91,000 కోట్ల విలువైన ఫ్యాబ్ ద్వారా 20,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పించాలని యోచిస్తోంది. అసోంలో రూ.27,000 కోట్ల ఓశాట్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 27,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. 2024 మార్చిలో ధోలేరాలో టాటా యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ 2026 డిసెంబర్ నాటికి ఆ యూనిట్ నుంచి మొదటి చిప్ బయటకు వస్తుందని చెప్పారు.