రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్‌ యూనిట్‌! | why foxconn invest in tamilnadu for new unit | Sakshi
Sakshi News home page

రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్‌ యూనిట్‌!

Sep 25 2024 9:26 AM | Updated on Sep 25 2024 10:44 AM

why foxconn invest in tamilnadu for new unit

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ సంస్థ యోచిస్తోంది.  తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్‌ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్‌ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.

ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే తమిళనాడులో యాపిల్‌ ఐఫోన్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్‌ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్‌ప్లే మాడ్యూల్స్‌ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్‌ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్‌కాన్‌కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్‌ప్లే అసెంబ్లింగ్‌లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?

ఫాక్స్‌కాన్ భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్‌లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్‌ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్‌ప్లే అసెంబ్లింగ్‌ యూనిట్‌ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement