అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపైనే ఇన్వెస్టర్ల ప్రధాన దృష్టి
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. బ్యారెల్కు 100 డాలర్ల దిశగా క్రూడ్
ఎఫ్పీఐల అమ్మకాలు, డాలర్–రూపాయి కదలికలూ కీలకమే
ఈ వారం ట్రేడింగ్పై నిపుణుల అంచనా
ముంబై: ముడిచమురు ధరలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియా పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల వేలం, యూరప్ దేశాల నుంచి వెలువడే ఆర్థిక గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. దేశీయంగా వచ్చే వారం (సెపె్టంబర్ 7–10 తేదీల మధ్య) ఏకంగా 11 కంపెనీలు ఐపీఓలకు రానుండటంతో ప్రైమరీ మార్కెట్పైనా ఫోకస్ ఉంటుంది.
ఈ ఇష్యూల ద్వారా మొత్తం రూ.7,055 కోట్ల వరకు సమీకరించనున్నారు. ఈ నేపథ్యంలో దలాల్ స్ట్రీట్లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అంశం అత్యంత కీలకంగా మారనుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు, రూపాయి విలువ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపనున్నాయి. ‘‘వడ్డీ రేట్లపై ఆయా దేశాల ద్రవ్య పరపతి విధాన వైఖరి, క్రూడాయిల్ ధరల కదలికలు, భౌగోళిక పరిమాణాలకు మార్కెట్ స్పందించే అవకాశం ఉంది. అంతర్జాతీయ పెరిగిన చమురు ధరలు భారత్లో ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్య మారక ద్రవ్యం, కార్పొరేట్ లాభాలపై ప్రభావం చూపనుంది’’ అని హెచ్ఎస్టీ వెల్త్ సీఈవో, వ్యవస్థాపకుడు హరిసెల్వన్ రాధాకృష్ణన్ తెలిపారు.
యూఎస్ ద్రవ్యోల్బణంపైనే ప్రధాన దృష్టి
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సమీప భవిష్యత్ గమనాన్ని నిర్దేశించడంలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. అమెరికా ఆగస్టు ఉద్యోగాల గణాంకాలు అంచనాల కంటే బలంగా నమోదైన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల అంచనాలు మారుతున్నాయి. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరిపై ప్రభావం చూపే అమెరికా పీపీఐ గణాంకాలు గురువారం, సీపీఐ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ద్రవ్యోల్బణం నెలవారీగా 0.4 శాతం పెరగవచ్చని, వార్షికంగా 3.4 శాతం వద్ద ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంచనాలకు మించి ద్రవ్యోల్బణం నమోదైతే ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించవచ్చన్న ఆందోళనలు పెరిగి.. ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు అధికమయ్యే అవకాశం ఉంది.
చమురు మంటలతో కంగారు
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల దిశను నిర్దేశించడంలో ముడిచమురు ధరలు ఈ వారం అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 96 డాలర్ల స్థాయికి చేరింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో భౌగోళిక రాజకీయ రిస్క్ పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్రూడ్ ధర 100 డాలర్లకు చేరువ కావడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
అమ్మకాల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) మళ్లీ అమ్మకాల బాట పట్టారు. జూలైలో రూ.20,200 కోట్లకు, ఆగస్టులో రూ.29,600 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్పీఐలు.. సెపె్టంబర్ తొలి వారంలో రూ.7,443 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలోపేతం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ప్రాథమిక మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరలు, ఫెడ్ విధాన నిర్ణయాలు విదేశీ నిధుల ప్రవాహాన్ని ప్రభావితం చేయనున్నాయి.
గతవారంలో రూ.15 లక్షల కోట్లు ఆవిరి
క్రూడ్ సెగలు, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకు దిగారు. దీంతో సూచీలు వరుసగా నాలుగో వారమూ నష్టపోయాయి. సెన్సెక్స్ 749 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత వారంలో రూ.15 లక్షల కోట్లు తగ్గి రూ.414 లక్షల కోట్లకు దిగొచి్చంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా నిఫ్టీకి 23,800 స్థాయి అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఈ స్థాయికి దిగువన అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువన 23,950 వద్ద తక్షణ నిరోధం ఉండగా.. దాన్ని అధిగమిస్తే 24,130 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయినీ దాటి 24,250 పైన స్థిరపడితే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ మరింత బలపడే అవకాశం ఉంది. సెన్సెక్స్కు 76,100–75,800 శ్రేణి కీలక మద్దతు ప్రాంతంగా కనిపిస్తోంది. 76,100 స్థాయి పైన నిలబడితే సూచీలో రికవరీకి అవకాశం ఉందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.


