
న్యూఢిల్లీ: వేల్యుయేషన్ సముచితంగా ఉంటే మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తామని ‘యూనికామర్స్ ఈసొల్యూషన్స్’ సీఈవో కపిల్ మఖీజా తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ–కామర్స్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని, ఆమ్నిచానల్లాంటి కొత్త మోడల్స్ తెరపైకి వచ్చాయని ఆయన చెప్పారు.
కంపెనీ ఇటీవలే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫాం షిప్వేను కొనుగోలు చేసిన నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనికామర్స్ ప్రస్తుతం 7,000 పైచిలుకు వ్యాపారాలకు సేవలు అందిస్తోందని ఆయన వివరించారు.
ఈ–కామర్స్ వ్యవస్థలో కస్టమర్లతో సంప్రదింపుల దశ, లావాదేవీలను ప్రాసెస్ చేసే దశ, ఆర్డరును పూర్తి చేసే దశ అని మూడు దశలు ఉంటాయని, తమ సంస్థ ఈ మూడు అంశాల్లోనూ సర్వీసులు అందిస్తోందని కపిల్ వివరించారు. తాము ఇప్పటికే భారత్ కాకుండా ఆరు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, మరింతగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.