
2027 నాటికి ఏటా 10 బిలియన్ డాలర్ల లక్ష్యం
సరఫరాదార్లతో పని చేస్తున్న వాల్మార్ట్
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 2027 నాటికి భారత్ నుంచి కొనుగోళ్ల పరిమాణాన్ని ఏటా 10 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు స్థానిక సరఫరాదార్లతో కలిసి క్రియాశీలకంగా పని చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన కంపెనీ సీఈవో డగ్ మెక్మిలన్ ఈ విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా తమ వాల్మార్ట్ వృద్ధి కార్యక్రమం కింద శిక్షణ కల్పించిన కొందరు విక్రేతలను ఆయన కలిశారు. తమ ఈ–కామర్స్ విభాగం ఫ్లిప్కార్ట్, డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే లాంటి వ్యాపారాల నుంచి కొత్త ఆవిష్కరణలు, మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించడం, విక్రేతలను పెంచుకోవడం తదితర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మెక్మిలన్ వివరించారు. భారత్తో తమకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు
గత దశాబ్ద కాలంలో భారత మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని, వచ్చే దశాబ్ద కాలం కూడా ఇదే జోరు కొనసాగబోతోందని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ వృద్ధి ప్రోగ్రాం కింద ఒక లక్ష పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చేరువ కానున్నట్లు వాల్మార్ట్ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్మార్ట్ భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ, మార్కెట్ యాక్సెస్ విషయంలో సహాయ, సహకారాలు అందిస్తోంది. భారతీయ తయారీదార్లు అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్కి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించేలా 2002లో బెంగళూరులో వాల్మార్ట్ గ్లోబల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.