దేశీయంగా డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం ఏకీకృత చెల్లింపు విధానాన్ని (యూపీఐ) ప్రవేశపెట్టి పదేళ్లవుతోంది. 2016 ఆగస్టు 25న అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల పరిమాణం ఏకంగా 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో 1.78 కోట్లుగా ఉన్న పరిమాణం 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వ్యవధిలో లావాదేవీల విలువ రూ. 7,000 నుంచి సుమారు 4,000 రెట్లు పెరిగి రూ. 314 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది.
రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) రూపొందించిన యూపీఐ ఇటు లావాదేవీల పరిమాణం, అటు విలువపరంగా కూడా గత పదేళ్లలో అసాధారణ స్థాయిలో పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఐ ప్రస్థానంలో 2026 కీలక మైలురాయిగా నిలిచినట్లు వివరించింది. ఈ ఏడాది మేలో నెలవారీ లావాదేవీలు తొలిసారిగా 2,300 కోట్లు దాటి 2,320 కోట్లకు చేరాయని పేర్కొంది. జూలైలో ఇది మరింతగా పెరిగి 2,366 కోట్ల లావాదేవీలకు చేరినట్లు వివరించింది.
మరిన్ని ప్రత్యేకతలు..
తొలి ఏడాది 2016–17లో యూపీఐలో చేరిన బ్యాంకుల సంఖ్య 44గా ఉండగా ప్రస్తుతం అది 703కి చేరింది.
దేశీయంగా డిజిటల్ చెల్లింపుల కోసం తీర్చిదిద్దిన ఆవిష్కరణ నేడు సీమాంతర లావాదేవీలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ వినియోగంలో ఉంది. యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవులు ఈ జాబితాలో ఉన్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారం 2025లో గ్లోబల్గా రియల్టైమ్ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా నమో దైంది.
From your morning chai to your daily essentials, from college canteens to fuel stops and festive shopping, UPI has become a trusted part of everyday life.
As we celebrate #10yearsofUPI, we thank every citizen, merchant, student, professional, and entrepreneur who made digital… pic.twitter.com/ncET2e07Yj— Ministry of Finance (@FinMinIndia) August 22, 2026


