
భారత్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యంత విలువైన బ్రాండ్ వివరాలను ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక తెలియజేసింది. దేశంలో టాటా గ్రూప్ (బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది) మరోసారి అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక రంగాల్లో టాటా గ్రూప్ వ్యూహాత్మక పెట్టుబడులతో దేశంలో వేగంగా విస్తరిస్తోందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.
దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్లు మొత్తంగా బ్రాండ్ విలువలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా పిలుపును భారత్ నూతన శక్తితో స్వీకరిస్తోంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ఆర్థిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ తన అగ్రశ్రేణి బ్రాండ్లను గ్లోబల్ లీడర్లుగా మారుస్తున్నాయి’ అన్నారు.