లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Updates on November 29, 2024 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Nov 29 2024 9:24 AM | Updated on Nov 29 2024 3:29 PM

Stock Market Updates on November 29, 2024

శుక్రవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 705.11 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో.. 79,748.85 వద్ద, నిఫ్టీ 208.20 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,122.35 పాయింట్ల వద్ద నిలిచాయి.

భారతి ఎయిర్‌టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 23,973కు చేరింది. సెన్సెక్స్‌ 154 పాయింట్లు ఎగబాకి 79,177 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.38 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.6 శాతం దిగజారింది.

మార్కెట్‌ ఒడిదొడుకులకు కొన్ని కారణాలు

  • అమెరికాలో అక్టోబర్‌ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్‌ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.

  • డిసెంబర్‌లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్‌ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.

  • అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్‌ ఇండెక్స్‌ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్‌ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement