స్థిరంగా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock market updates on Febraury 27, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్థిరంగా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Feb 27 2025 9:34 AM | Updated on Feb 27 2025 10:42 AM

Stock market updates on Febraury 27, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం అంతకుముందు సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 22,556కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 15 పాయింట్లు పుంజుకొని 74,626 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 106.6 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 72.75 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం పెరిగింది. నాస్‌డాక్‌ 0.26 శాతం లాభపడింది.

మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్‌ ప్రభావంతో లార్జ్‌ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్‌ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్‌ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్‌ ట్రంప్‌ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్‌ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్‌ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.

ఇదీ చదవండి: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ 20 శాతానికి పెంపు

అధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్‌ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్‌ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement