భారత్‌ వైపు.. స్టార్టప్స్‌ చూపు... | Singapore and Canada-based startups keen to explore Indian market | Sakshi
Sakshi News home page

భారత్‌ వైపు.. స్టార్టప్స్‌ చూపు...

Nov 9 2025 2:03 AM | Updated on Nov 9 2025 2:03 AM

Singapore and Canada-based startups keen to explore Indian market

మన మార్కెట్లో విస్తరణపై సింగపూర్, కెనడా అంకురాల ఆసక్తి 

భారీ మార్కెట్, అధిక వృద్ధి అవకాశాలే కారణం

న్యూఢిల్లీ: దేశీయంగా భారీ మార్కెట్, వేగవంతమైన ఆర్థిక వృద్ధి తదితర అంశాల కారణంగా పలు అంతర్జాతీయ అంకుర సంస్థలు భారత మార్కెట్లో విస్తరించే యోచనలో ఉన్నాయి. సింగపూర్, కెనడా తదితర దేశాలకు చెందిన స్టార్టప్స్‌ వీటిలో ఉన్నాయి. హాంకాంగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పార్క్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌కేఎస్‌టీపీ) నిర్వహించిన గ్లోబల్‌ పిచ్‌ కాంపిటీషన్‌ ’ఎపిక్‌ 2025’లో పాల్గొన్న సందర్భంగా పలు విదేశీ అంకుర సంస్థలు భారత్‌పై ఆసక్తి వ్యక్తం చేశాయి.

70 పైగా దేశాలకు చెందిన 100 స్టార్టప్స్‌ నుంచి ఈ కాంపిటీషన్‌కి సుమారు 1,200 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో భారత్‌ నుంచి రెండు అప్లికేషన్లు ఉన్నాయి. ఈ దరఖాస్తులను ప్రధానంగా డిజిటల్‌ హెల్త్‌ టెక్, ఫిన్‌టెక్, గ్రీన్‌టెక్‌ అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఎంట్రప్రెన్యూర్లను వర్ధమాన మార్కెట్లు, ఇన్వెస్టర్లు, ప్రపంచ స్థాయి ఆవిష్కరణల వ్యవస్థలకు అనుసంధానం చేసేందుకు ఎపిక్‌ 2025 తోడ్పడుతుందని హెచ్‌కేఎస్‌టీపీ చైర్మన్‌ సన్నీ తెలిపారు.  

సానుకూల పరిస్థితులు ఆకర్షణీయం.. 
భారత్‌లో స్టార్టప్‌లకు అనువైన వ్యవస్థ ఉందని బ్యాటరీ రీసైక్లింగ్‌ కార్యకలాపాలు సాగించే సింగపూర్‌ సంస్థ న్యూ బ్యాటరీ మెటీరియల్స్‌ చైర్మన్‌ బ్రయాన్‌ తెలిపారు. ఇక్కడ భారత్‌లో పెద్ద సంఖ్యలో టూ–వీలర్లు, త్రీ–వీలర్లతో భారీ మార్కెట్‌ ఉందని తెలిపారు. బ్యాటరీ రీసైక్లింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్న స్టార్టప్‌లు మెరుగ్గా రాణిస్తున్నాయని వివరించారు. భారత ప్రభుత్వ విధానాల గురించి మరింత తెలుసుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌టెక్‌ కేటగిరీలో న్యూ బ్యాటరీస్‌ మెటీరియల్స్‌ విజేతగా నిలి్చంది.

మరోవైపు, ఏ ఇన్వెస్టరుకైనా భారత్‌లో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌ కార్గో సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే సింగపూర్‌ కంపెనీ ’బెల్లి’ ప్రోడక్ట్‌ ఇంజినీర్‌ జేడెన్‌ తెలిపారు. భారత్‌లో అంకురాలకు మంచి భవిష్యత్తు ఉండగలదన్నారు. భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కెనడాకి చెందిన కేఏ ఇమేజింగ్‌ ప్రెసిడెంట్‌ అమోల్‌ ఎస్‌ కారి్నక్‌ చెప్పారు. సైన్స్, మెడికల్‌ టెక్నాలజీల అభివృద్ధికి భారత ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుండటం తమకు ఒక అవకాశంగా ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ సంస్థకు అనువైన మరిన్ని విధానాలపై అధ్యయనం చేస్తామని వివరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement