
రూ.1,000 అప్; మరో కొత్త గరిష్టం
ఢిల్లీలో ధర రూ. 1.08 లక్షలు
న్యూఢిల్లీ: వెండి రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం వెండి కేజీ ధర మరో రూ. 1,000 పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ. 1,08,100ని తాకిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటం, అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాలు.. సౌర విద్యుత్ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం తదితర అంశాలు ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు.
వెండి అంతర్జాతీయంగా 13 ఏళ్ల గరిష్టం, దేశీయంగా లైఫ్టైమ్ గరిష్టాలను తాకినట్లు మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. యూరప్లో ద్రవ్యోల్బణం నెమ్మదించడం, వాణిజ్య వివాదాలు సమసిపోవడంపై ఆశావహ భావం నెలకొనడం లాంటి అంశాలతో వెండి ధర కన్సాలిడేషన్ శ్రేణి నుంచి బైటపడిందని, ఔన్సు (31.1 గ్రాములు) రేటు 36 డాలర్లను అధిగమించిందని పేర్కొన్నారు.
మరోవైపు, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 280 మేర తగ్గి రూ. 97,780కి (పన్నులు సహా) పరిమితమైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ త గల బంగారం ధర రూ. 250 క్షీణించి రూ. 97,350కి తగ్గింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య సానుకూల సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశాభావం నెలకొన్న నేపథ్యంలో బంగారంలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాలకు డిమాండ్ కాస్త నెమ్మదించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.