10,500 పతనమైన వెండి
రూ.3,000 తగ్గిన బంగారం ధర
న్యూఢిల్లీ: బంగారం, వెండి మళ్లీ నష్టాల బాట పట్టాయి. డాలర్ బలపడడం వీటిల్లో అమ్మకాలకు దారితీసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలు, యూఎస్ డాలర్ బలంగా ఉండడం వంటివి పసిడి, వెండిలో అమ్మకాలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు. పసిడి 10 గ్రా.కు రూ.3,000 తగ్గి రూ.1,49,300 స్థాయికి పరిమితమైంది.
వెండి అయితే కిలోకి ఏకంగా రూ.10,500 నష్టపోయి రూ.2,35,000 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 70 డాలర్లు పడిపోయి (2 శాతం) 4,121 స్థాయికి, వెండి 4 శాతం నష్టంతో 62.27 డాలర్ల స్థాయికి దిగొచ్చాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతితో ముందు రోజు పసిడి, వెండి లాభపడగా, తిరిగి వడ్డీరేట్లపై ప్రతికూల అంచనాలతో అమ్మకాలు ఎదురైనట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కేనత్ చైన్వాలా వివరించారు.


