న్యూఢిల్లీ: పసిడి, వెండి వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.8,040 నష్టపోయి రూ.2,40,700 వద్ద స్థిరపడింది. తద్వారా రెండున్నర నెలల కనిష్టానికి (ఏప్రిల్ 7 తర్వాత) చేరుకుంది. బంగారం 10 గ్రాములకు రూ.2,840 నష్టంతో రూ.1,50,600 స్థాయికి దిగొచ్చింది. డాలర్ బలపడడం అమ్మకాలకు ప్రేరణనిచ్చింది.
అమెరికా వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే మరికొన్నాళ్లు కొనసాగుతాయన్న స్పష్టత నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపడం బులియన్ మార్కెట్పై ఒత్తిడికి దారితీసినట్టు విశ్లేషకుల అభిప్రాయం. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1.5% నష్టంతో 4,180 డాలర్లు, వెండి 2% నష్టపోయి 65 డాలర్ల స్థాయికి వచ్చాయి.


