ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.
అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.
కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు.


