ప్రముఖ టీవీ ఛానల్‌ ద్వారా షేర్ల రిగ్గింగ్‌! | Rigging Of Shares By Zee Business TV Channel, More Details Inside - Sakshi
Sakshi News home page

ప్రముఖ టీవీ ఛానల్‌ ద్వారా షేర్ల రిగ్గింగ్‌!

Feb 9 2024 2:24 PM | Updated on Feb 9 2024 3:45 PM

Rigging Of Shares By Zee Business TV Channel - Sakshi

ప్రముఖ బిజినెస్‌ చానల్‌లో స్టాక్‌ సిఫార్సులిచ్చే పది మంది నిపుణులతోపాటు ఐదుగురు గెస్ట్‌ అనలిస్ట్‌లపై నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. షేర్‌ రిగ్గింగ్‌కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ.7.41 కోట్ల స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. 

సెబీ దర్యాప్తు వివరాల ప్రకారం జీ బిజినెస్‌ న్యూస్‌ ఛానల్‌లో ఏ స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నామన్నది గెస్ట్‌ నిపుణులు ముందుగానే కొంతమంది ప్రాఫిట్‌ మేకర్స్‌కు చెబుతారు. సమాచారం అందుకున్న ప్రాఫిట్‌ మేకర్స్‌ తొలుత ఆ షేరు లేదా డెరివేటివ్‌ కాంట్రాక్టులో పొజిషన్లు తీసుకుంటారు. దాంతో రిటైలర్లు సైతం అందులో ఇన్వెస్ట్‌చేసిన తర్వాత లాభాలు స్వీకరించి పొజిషన్లను విక్రయిస్తారు.

గెస్ట్‌ అనలిస్టులు కిరణ్‌ జాదవ్‌, అశీష్‌ కేల్కర్‌, హిమాన్షు గుప్తా, ముదిత్‌ గోయల్‌, సిమి భౌమిక్‌ల సిఫార్సులు ఛానల్‌లో ప్రసారం అయిన తర్వాత ఆ పొజిషన్లను మార్చి లాభం సంపాదించినట్లు సెబీ గుర్తించింది. ఈ ఉదంతంలో నిర్మల్‌ కుమార్‌ సోని, పార్థసారథి ధర్‌, శార్‌ కమోడిటీస్‌, మానన్‌ షేర్‌కామ్‌, కన్హా ట్రేడింగ్‌ కంపెనీలు ప్రాఫిట్‌ మేకర్స్‌గా వ్యవహరించారని సెబీ పేర్కొంది. ఆ లావాదేవీల్లో వచ్చిన లాభాల్ని అందరూ పంచుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ‘వేర్‌’వేర్లు..! విభిన్న సాఫ్ట్‌వేర్లు.. 

దర్యాప్తు అనంతరం సెబీ 127 పేజీల ఆర్డర్‌ను జారీచేస్తూ వారిని సెక్యూరిటీ లావాదేవీల నుంచి నిషేధించింది. గెస్ట్‌ నిపుణులకు సంబంధించిన కంటెంట్‌తో సహా వీడియో రికార్డులు, ఇతర రికార్డుల్ని భద్రపర్చాలని జీ మీడియాను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement