భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంగా మార్చాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లలోని అమెరికా సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆదివారం సెలవు కావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లు నేరుగా స్పందించనప్పటికీ వారంతపు ఆఖరి సెషన్లో సాధించిన రికార్డు గరిష్టాల నుంచి నేడు ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒడిదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
భగ్గుమన్న బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు
పశ్చిమాసియాలో ఏ చిన్న అలజడి రేగినా దాని ప్రత్యక్ష ప్రభావం చమురు ధరలపై పడుతుంది. ఇరాన్ దాడులు జరిగిన ప్రాంతాలు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గానికి సమీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత శుక్రవారం (జులై 10) నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు సుమారు 75-76 డాలర్ల వద్ద నిలకడగా ఉంటే ప్రస్తుతం అది 79.2 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశానికి కరెంట్ అకౌంట్ లోటు పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇది భారత మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే మొదటి అంశం.
గ్లోబల్ మార్కెట్ల రియాక్షన్
అంతర్జాతీయ మార్కెట్లు గత వారం అమెరికా టెక్ స్టాక్స్ ర్యాలీతో రికార్డు స్థాయిల్లో ముగిశాయి. అయితే, ఈ తాజా పరిణామం ఇన్వెస్టర్లను రక్షణ ధోరణి వైపు నెట్టనుంది. నేడు ఉదయం ప్రారంభమయ్యే నికాయ్, హాంగ్ సెంగ్, గిఫ్ట్ నిఫ్టీ సూచీలు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రతికూలతతో కదలాడుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది.
పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగిసిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లాంటి సంస్థలు గతంలో భావించినప్పటికీ ఇరాన్ నేరుగా ఐదు దేశాలపై దాడులకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇన్వెస్టర్లు నేడు మార్కెట్ ప్రారంభంలోనే కంగారుపడి విక్రయాలు చేయకుండా కొద్దిసేపు మార్కెట్ కదలికలను గమనించడం ఉత్తమం. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, నేడు జులై 13, 2026 సోమవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా?


