
హెల్మెట్ రాచ్తో అనిల్ అంబానీ చర్చలు
భాగస్వామ్య పటిష్టతపై ప్రత్యేక దృష్టి
ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ తాజాగా జర్మన్ ఆయుధ తయారీ కంపెనీ డియల్ డిఫెన్స్తో వ్యూహాత్మక సహకరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆధునిక ఆర్టిలరీ షెల్స్ తయారీని చేపట్టనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానికంగా అత్యంత ఆధునిక వుల్కనో 155 ఎంఎం ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్ సిస్టమ్(ఆర్టిలరీ షెల్స్)ను రూపొందించనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి దేశీ సాయుధ దళాలకు ఉపయోగపడనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ తెలియజేసింది. బిల్టిన్ ఈసీసీఎం సామర్థ్యాలతో రూపొందించనున్న 155 ఎంఎం టీటీఎంలు శత్రువుల ఎల్రక్టానిక్ జామింగ్ ప్రయత్నాలను తప్పించుకోగలవని వివరించింది. 10 సెకన్లలోనే లక్ష్యాలను చేరుకోగలవని వెల్లడించింది. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీలో ప్రయివేట్ రంగ ముందడుగును తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది. తదుపరితరం లేజర్, జీపీఎస్ గైడెడ్ టార్గెటింగ్ టెక్నాలజీతో ఈ ఆధునిక మ్యునిషన్ సిస్టమ్స్ రూపొందనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ తెలియజేసింది.
ఇదీ చదవండి: ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!
2019లోనే వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసిన సంస్థల మధ్య మరింత అవగాహన కోసం డియల్ డిఫెన్స్ సీఈవో హెల్మట్ రాచ్తో రిలయన్స్(అడాగ్) గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అంబానీ చర్చలు నిర్వహించినట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు తెలియజేశాయి. కాగా.. ఒప్పందంలో భాగంగా కొత్త హైటెక్ తయారీ ప్లాంటును మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న వటాడ్ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ వెల్లడించింది. తద్వారా దేశీ సాయుధ దళాలకు అవసరమైన ఉత్పత్తులను అందించనున్నట్లు తెలియజేసింది. వార్షికంగా 2 లక్షల ఆర్టిలరీ షెల్స్, 10,000 టన్నుల పేలుడుపదార్ధాలు, 2,000 టన్నుల ప్రొపెల్లంట్ తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటును నెలకొల్పనున్నట్లు వివరించింది.