
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: విదేశీ ఆదాయం, ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదారులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 5,483 మంది పన్ను చెల్లింపుదారుల తమకు రూ.29,208 కోట్ల విదేశీ ఆదాయం, మరో రూ.1,090 కోట్ల అదనపు ఆదాయం ఉందంటూ ఆలస్యపు రిటర్నులు దాఖలు చేసినట్టు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నోటీసులకు స్పందించని పన్ను చెల్లింపుదారులపై చట్ట పరిధిలో సరైన చర్యలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తుల మూడింతలు పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు (రూ.37,600 కోట్లు) చేరినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రకటన చారీ చేయడం గమనార్హం. 2024–25 అసెస్మెంట్ సంవత్సరం ఐటీఆర్లలో పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన విదేశీ ఆస్తులు, ఆదాయం గణనీయంగా పెరిగిపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ముందుకు వస్తున్నట్టు, తమ ఐటీఆర్లను సమీక్షించుకుంటున్నట్టు తెలిపింది.