ఇదీ బాబు చిట్టా! | Andhra Pradesh CM Chandrababu Naidu is richest with assets over Rs 931 crore | Sakshi
Sakshi News home page

ఇదీ బాబు చిట్టా!

Jul 28 2026 5:58 AM | Updated on Jul 28 2026 5:58 AM

Andhra Pradesh CM Chandrababu Naidu is richest with assets over Rs 931 crore

ఆస్తులు రూ.931కోట్లు

క్రిమినల్‌ కేసులు19

చంద్రబాబుపై 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు

ఐపీసీ 307 కింద రెండు హత్యాయత్నం కేసులు.. పది నేరపూరిత కుట్ర కేసులు

ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ తాజా నివేదిక వెల్లడి

అత్యధికంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే రెండో అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. అదే సమయంలో ఆయనపై 19 క్రిమినల్‌ కేసులు, 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా సీఎంల ఆస్తులు, నేర చరిత్రపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సోమవారం సంచలన నివేదిక విడుదల చేసింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతా లకు చెందిన 31 మంది సీఎంల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్‌ ఈ నివేదికను రూపొందించింది.  

చంద్రబాబు ఆస్తులు, కేసుల చిట్టా... 
చంద్రబాబు నాయుడు అఫిడవిట్‌ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.931,83,70,656గా ఉంది. ఇందులో చరాస్తులు రూ.810,42,29,047 కాగా స్థిరాస్తులు రూ.121,41,41,609 ఉన్నాయి. ఆయనకు రూ.10,32,05,875 అప్పులు ఉండగా, అందులో రూ.6,04,900 వివాదాస్పద అప్పులు ఉన్నాయి. స్వీయ ఆదాయంగా రూ.18,39,721 చూపించారు. కేసుల విషయానికి వస్తే మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. ప్రధానంగా ఐపీసీ 307 కింద రెండు హత్యాయత్నం కేసులు, పది నేరపూరిత కుట్ర కేసులు (ఐపీసీ 120బీ), ఐదు క్రిమినల్‌ నమ్మకద్రోహం కేసులు (ఐపీసీ 409), నాలుగు చీటింగ్‌ కేసులు (ఐపీసీ 420), విద్వేషాలు రెచ్చగొట్టడంపై మూడు కేసులు (ఐపీసీ 153ఏ) చంద్రబాబుపై నమోదయ్యాయి.

నలుగురు శత కోటీశ్వరులు.. 
దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో నలుగురు (13 శాతం) శత కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ రూ.1,413 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా సీఎం చంద్రబాబు నాయుడు (రూ.931 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడు సీఎం సి.జోసెఫ్‌ విజయ్‌ రూ.648 కోట్లతో మూడో స్థానంలో, అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు రూ.332 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల్లో జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రూ.55.24 లక్షలతో అట్టడుగున ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారికి రూ.85.87 లక్షలు, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మకు రూ.1.46 కోట్ల ఆస్తులున్నాయి.   

45 శాతం సీఎంలపై క్రిమినల్‌ కేసులు.. 
ఏడీఆర్‌ విశ్లేషణ ప్రకారం 31 మంది సీఎంలలో 14 మంది (45 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. వీరిలో 11 మంది (35 శాతం) సీఎంలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులపై ఏకంగా హత్యాయత్నం (ఐపీసీ 307) కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా అందులో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.30.04 కోట్లుగా నమోదైంది.  

సగటు ఆస్తి రూ.118 కోట్లు..
ముఖ్యమంత్రులందరి మొత్తం ఆస్తుల విలువ రూ.3,660 కోట్లుగా లెక్క తేలింది. సగటున ఒక్కో సీఎం ఆస్తి రూ.118.07 కోట్లుగా ఉంది. మొత్తం 31 మంది సీఎంల స్వయం ఆదాయం రూ.203 కోట్లు కాగా సగటు ఆదాయం రూ.6.54 కోట్లుగా నివేదిక పేర్కొంది. అప్పుల విషయానికి వస్తే 11 మంది సీఎంలకు రూ.కో టికి పైగా అప్పులు ఉన్నాయి. కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌ అత్యధికంగా రూ.265 కోట్ల అప్పులతో మొదటి స్థానంలో ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు (రూ.180 కోట్లు), అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ (రూ.16 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.  

ఒక్కరే మహిళా ముఖ్యమంత్రి.. 
దేశవ్యాప్తంగా 31 మంది సీఎంలలో ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా) ఉన్నారు. సీఎంల విద్యార్హతలను పరిశీలిస్తే.. 9 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఏడుగురు గ్రాడ్యుయేట్లు, ఆరుగురు ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ముగ్గురు డాక్టరేట్‌ పూర్తి చేయగా, ముగ్గురు 12వ తరగతి, ఇద్దరు 10వ తరగతి చదివారు. ఒక సీఎం డిపొ్లమా చేశారు. వయసు పరంగా చూస్తే అత్యధికంగా 17 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు కాగా, 41–50 ఏళ్ల మధ్య 8 మంది, 71–80 ఏళ్ల మధ్య నలుగురు, 61–70 ఏళ్ల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement