అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందే..
దగాపడిన అభ్యర్థుల డిమాండ్
పేపర్ లీక్కు పక్కా ఆధారాలున్నాయి..
స్పోర్ట్స్ కోటా పేరుతో అతిపెద్ద కుంభకోణం
అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారు..
అందుకోసం ఏకంగా జీవోలూ తెచ్చారు..
అడ్డంగా దొరికిపోయినా బాధ్యత వహించరా?
నీట్ లీక్కు కేంద్రం బాధ్యత వహించింది కదా.. అదే బాటలో మీరూ నడవాలి
ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాలి
దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ.. యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో నష్టపోయిన అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా దగా, మోసం, పెద్ద కుంభకోణమని నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్, స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల అమ్మకం, నియామక ఉత్తర్వుల జారీలో అవకతవకలు ఇలా డీఎస్సీలో జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనకాడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్రం బాధ్యత వహించినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని నినదిస్తున్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ కూడా రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
స్కామ్ల డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలను నిర్వహించబోతోంది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, బాధితుల పక్షాన నిలుస్తూ ఈ ఏడాది జూన్ ఒకటిన వైఎస్సార్సీపీ యువజన విభాగం కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. సీబీఐ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్లు, ఆర్డీవోలు, ప్రభుత్వానికి అనేక వినతులు సమర్పించింది. అయితే నిష్పçక్షపాతంగా సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు బాబు సర్కార్ జంకుతోంది.
సీబీఐ విచారణంటే బెరుకెందుకు.?
నీట్ యూజీ తరహాలోనే ఏపీ డీఎస్సీ ప్రశ్నాపత్రం సైతం తయారీ చేసిన దగ్గరే లీక్ అయిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ, ఆన్లైన్ అప్లోడ్ చేయడం వంటి ఎంతో గోప్యమైన ప్రక్రియలో పాల్గొన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాప్ ర్యాంకర్గా నిలవడమే పేపర్ లీక్కు పెద్ద సాక్ష్యమని చెబుతున్నారు. టాప్ ర్యాంకర్గా నిలిచినప్పటికీ నవీన్కు ఉద్యోగం ఇవ్వకపోగా, రెండో దఫా ఇచ్చిన మెరిట్ లిస్ట్లో నవీన్ వివరాలను తొలగించడంతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైందని యువత గుర్తుచేస్తోంది. అయితే ఈ లీక్ ఎంత వరకూ వెళ్లింది? లీకైన పేపర్ ద్వారా ఎంత మంది ఉద్యోగాలు సాధించారు? లీక్ వెనుక అసలు కుట్రదారులు ఎవరు? అనే విషయాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అభ్యర్థులు నమ్ముతున్నారు.
ప్రభుత్వం నిష్పక్షపాతంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం వాదిస్తోంది. పేపర్ లీక్ కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే నవీన్ టాప్ ర్యాంకర్గా నిలిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సెలక్షన్ లిస్టులో అతని పేరు తొలగించడమే కాకుండా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు రాలేదని బుకాయించడం... ఇలా ప్రభుత్వం చేసిన తప్పుల మీద తప్పులే పేపర్ లీక్కు మెగా సాక్ష్యాలని అభ్యర్థులు బల్లగుద్ది వాదిస్తున్నారు.
జీవోలే సాక్ష్యం.. బేరసారాలే రుజువు..
రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా స్పోర్ట్స్ కోటా కింద అతిపెద్ద కుంభకోణం జరిగిన మాట వాస్తవం కాదా? అని బాబు సర్కార్ను యువత నిలదీస్తోంది. స్పోర్ట్స్ కోటా కుంభకోణానికి ప్రభుత్వం డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే ఇచ్చిన జీవో 4.. 47 అతిపెద్ద సాక్ష్యాలు కాగా.. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా పప్పుబెల్లాలు మాదిరిగా సాగిన టీచర్ పోస్టుల విక్రయాలకు బేరసారాల ఆడియోలే రుజువని స్పష్టం చేస్తున్నారు.
తామనుకున్నవారికి టీచర్ పోస్టులు అడ్డగోలుగా కట్టబెట్టడం కోసమే జీవో 4.. 47 తెచ్చారని నష్టపోయిన నిజమైన క్రీడాకారులు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో స్వర్ణపతకాలు సాధించిన వారికి సైతం అన్యాయం చేస్తూ టీడీపీ ప్రజా ప్రతినిధులు అధ్యక్షులుగా ఉన్న సంఘాల నుంచి పాల్గొన్న సర్టిఫికెట్లున్న వారికి టీచర్ పోస్టులు ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరం పెట్టారని, ఇందుకు సంబంధించిన ఆడియోలు వెలుగు చూసినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీస్తున్నారు.
బడా స్కామ్కు బాధ్యత ఎందుకు వహించరు?
దేశ చరిత్రలో వెలగు చూసిన ఆర్ఆర్బీ, మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్, పశ్చిమ బెంగాల్ సేవా కమిషన్ స్కామ్, ఇటీవల వెలుగు చూసిన నీట్ యూజీ పేపర్ లీక్ వంటి అనేక స్కామ్లను తలదన్నేలా ఏపీ డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని లక్షలాది మంది అభ్యర్థులు చెబుతున్నారు. వారు చేస్తున్న ప్రతి ఆరోపణకు పక్కాగా డిజిటల్, ఆడియో, వీడియో, రికార్డెడ్ సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ చేపట్టదని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు బాధ్యత వహించరని నిలదీస్తున్నారు.


